వదంతులు సృష్టించేవారిపై చర్యలు తప్పవు: డీజీపీ
సాక్షి, అమరావతి : లాక్డౌన్ ఎత్తేశాక పెద్ద ఎత్తున చోరీలు జరుగుతాయని, నేరాల రేటు పెరిగిపోతుందని జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. పోలీస్ హెచ్చరిక పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ పోస్టింగ్లపై స్పందించిన ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. లాక్డౌన్ తర్వాత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి హెచ్చరికలు చేయలేదని తెలిపారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవని, ఏవైనా సమస్యలుంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. (విశాఖ విషాదం; బాధిత కుటుంబాలకు రూ. కోటి బాసట)
డీజీపీ ఇంకా ఏమన్నారంటే..
► ప్రజలకు ఏ ఆపద వచ్చినా 100, 112, 104, 108 నంబర్లకు కాల్ చేయాలి.
► ప్రస్తుత పరిస్థితికి అన్వయించి రోజువారీ జాగ్రత్తలను కూడా జతచేసి సోషల్ మీడియా ద్వారా ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించాం.
► లాక్డౌన్ తర్వాత పిల్లలు, మహిళలను నేరస్తులు టార్గెట్ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు.
► ప్రజల దైనందిన జీవనం, ఇంటి వద్ద భద్రత వంటి అనేక అంశాలకు ముడిపెట్టి వారిని భయపెట్టేలా వదంతులు సృష్టిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.