వైఎస్సార్సీపీలో చేరిన అహ్మదుల్లా సోదరులు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా సోదరులు మహ్మద్ హబీబుల్లా, మహ్మద్ ఇనాయతుల్లా వారి కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే అంజాద్ బాషా, పార్టీ గల్ఫ్ విభాగం కన్వీనర్ ఇలియాస్ ఆధ్వర్యంలో వారంతా గురువారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను ఆయన నివాసంలో కలిశారు. వైఎస్సార్సీపీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. జగన్ వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్సీపీలో చేర్చుకున్నారు.
2009–14 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మహ్మద్ అహ్మదుల్లా తన కుమారుడితో కలిసి టీడీపీలో చేరారు. కానీ, ఆయన సోదరులు మాత్రం వైఎస్ జగన్తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. వీరి కుటుంబ సభ్యులు మహ్మద్ హఫీజుల్లా, డీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మహ్మద్ హాజీబాషా, మహ్మద్ హిదాయతుల్లా, మహ్మద్ కలీముల్లా, మహ్మద్ బర్కతుల్లా కూడా జగన్ను కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు దివంగత సీఎం వైఎస్సార్ కుటుంబంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జగన్ వారితో చాలాసేపు మాట్లాడారు.