చురుగ్గా ప్రజాసంకల్ప యాత్ర ఏర్పాట్లు
ఇడుపులపాయ నుంచి దువ్వూరు దాకా నేతల పర్యటన
పార్టీ సమన్వయకర్తలు, ముఖ్యులతో చర్చలు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ 6వ తేదీ నుంచి చేపట్టనున్న ప్రజాసంకల్ప యాత్ర ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త, ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి తదితరులు సోమవారం ఇడుపులపాయ నుంచి వైఎస్సార్ జిల్లా సరిహద్దు మండలం దువ్వూరు దాకా పర్యటించారు. పాదయాత్ర సాగే మార్గంలో మధ్యాహ్నం, రాత్రి బస ఏర్పాట్ల గురించి పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో నేతలు చర్చించారు.
6వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్లో మహానేతకు నివాళులర్పించిన అనంతరం 9 గంటలకు బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారని తలశిల రఘురాం తెలిపారు. ఆ తర్వాత ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. వైఎస్సార్సీపీ జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వేంపల్లి మండల పరిషత్ అధ్యక్షుడు రవికుమార్రెడ్డి, చక్రాయపేట మండల పార్టీ కన్వీనర్ వైఎస్ కొండారెడ్డి ఈ పర్యటనలో పాల్గొన్నారు.