అ‘ధన’పు జేసీ.. రూ.4.5 కోట్ల ఆస్తులు
విజయనగరంలో అదనపు జేసీ ఆస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి /విజయనగరం టౌన్/విశాఖ క్రైం/దేవరపల్లి: విజయనగరం జిల్లా అదనపు జేసీ కాకర్ల నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలోని పదిచోట్ల బుధవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ షకీలా భాను అందించిన వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలతో పాటు బెంగళూరులో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ విస్తృతంగా సోదాలు చేసి.. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.4.5 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు.
వీటి మార్కెట్ విలువ రూ.20 కోట్లకు పైనే ఉన్నట్టు అంచనా వేశారు. విజయనగరంలోని ఏజేసీ అధికారిక నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టారు. బెంగళూరులోని దావణగేరేతో పాటు రాష్ట్రంలోని ఆయన స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా త్యాజంపూడి, అనకాపల్లి, విశాఖలోని సీతమ్మధార, మల్కాపురం, ఆంధ్రాయూని వర్సిటీ ప్రాంతం, అగనంపూడిలోనూ, విజయనగరంలోని ఆయన అధికారిక నివాస గృహం, చాంబర్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్లోని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి.