పీపీపీ.. డుండుం..

Aadharana Scheme Delayed In YSR kadapa - Sakshi

ఆదరణ పథకం పేరుతో గ్రౌండింగ్‌ మేళా.. లబ్ధిదారుల గోల

పనిముట్ల కోసం పడరాని పాట్లు పడుతున్న పరిస్థితి

అయినా ఇంతవరకు అందని వైనం

పనిముట్లలో నాణ్యతా లోపంపై పెదవి విరుపు

డీడీలు తీయాలా...వద్దా అన్న సందిగ్ధంలో లబ్ధిదారులు

అధికారులు బతిమాలుతున్నా పట్టించుకోని వృత్తిదారులు

తలలు పట్టుకుంటున్న అధికారులు... ఆలోచనలో పడిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన ఆదరణ పథకం ఆటంకాలు ఎదుర్కొంటోంది. ఈనెల 12వతేదీన జిల్లాలోని మూడు డివిజన్లలో మెగా గ్రౌండింగ్‌మేళా నిర్వహించారు. అయితే ఇంతవరకు చాలా పనిముట్లు లబ్ధిదారులకు అందలేదు. గతంలో ప్రవేశ పెట్టిన ఈ పథకం ‘అట్టర్‌ ఫ్లాప్‌’గా అపఖ్యాతిని మూట గట్టుకుంది. అదే బాటలో తాజాగా ప్రవేశ పెట్టిన పథకం కూడా నడుస్తోందని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. కాగా రానున్న ఎన్నికలనేపథ్యంలో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తోందనేవిమర్శలు వినవస్తున్నాయి.   

సాక్షి కడప/రూరల్‌ : ఆదరణ పథకం రానురాను నిరాదరణకు గురవుతోంది. ఆర్భాటం, అట్టహాసం, ప్రచారం మినహా మిగిలినదంతా ప్రహసనం. ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణం.. ఎన్నికల ప్రయోజనమే లక్ష్యమన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. వెనుకబడిన తరగతుల్లో అట్టడుగు వర్గాల ప్రజలకు అందించాల్సిన ప్రయోజనం విషయంలోనూ ప్రభుత్వం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. ఈనెల 12వ తేదీన జిల్లాలోని కడప, రాజంపేట, జమ్మలమడుగు డివిజన్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ‘పేదరికంపై గెలుపు’ ఆదరణ–2 మెగా గ్రౌండింగ్‌ మేళా కార్యక్రమాన్ని  పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంజూరైన పనిముట్లను ఆయా గోడౌన్ల వద్దకు వెళ్లి తీసుకోవాని అధికారులు సూచించారు. అయినా ఇంత వరకు చాలా యూనిట్లు అందుబాటులోకి రాలేదు. ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి.

వారం దాటినా కూడా..
ఆదరణ పథకం కింద బీసీ వర్గాల్లోని వివిధ కుల వృత్తుల వారికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 16,486 యూనిట్లు మంజూరయ్యాయి.  ఒక యూనిట్‌ విలువ రూ.10 వేలు. రూ.20 వేలు, రూ. 30 వేలుగా ఉన్నాయి.  అందులో బీసీల వాటా 10 శాతం ఉంటుంది. అంటే ఉదాహరణకు రూ. 10 వేలకు రూ. 1000 లబ్ధిదారుడు భరించాలి. అంటే ఆ డబ్బును డీడీ రూపంలో తీయాలి. అలా డీడీలు తీసిన 5901 మందికే 12వ తేదీన జరిగిన మేళాలో ప్రొసీడింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. ఆ ఉత్తర్వులను తీసుకొ ని గోడౌన్ల వద్దకు వెళితే పనిముట్లను తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో లబ్ధిదారులు మరుసటి రోజు ఆయా గోడౌన్ల వద్దకు వెళ్లారు. అక్కడికి ఇంకా పనిముట్లు రాకపోవడంతో అవాక్కయ్యారు.

మంజూరు సరే.. పనిముట్లు ఏవీ..?
జిల్లాలో అట్టడుగు స్థాయిలో ఉన్న వెనుకబడిన వర్గాలకు సంబంధించి పనిముట్లు మంజూరు చేయడం బాగానే ఉన్నా వాటిని సకాలంలో అందించాలన్న ఆ లోచన ప్రభుత్వానికి లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. మంజూరైన పనిముట్లను ఆయా గోడౌన్లలో ఉంచాల్సి ఉంది. అయితే చాలీ చాలని స్థితిలో ఉంచడంతో చాలామందికి అందడం లేదు. లబ్ధిదా రులు గోడౌన్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. 

బాబ్బాబు డీడీలు కట్టండి
జిల్లాలో బీసీల్లోని అనేక సామాజిక వర్గాలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం గ్రౌండింగ్‌ మేళా నిర్వహించి పనిముట్లను లబ్ధిదారులకు చూపించారు.  అయితే మంజూరైన వృత్తిదారులే కాకుండా దరఖాస్తు చేసుకున్న అనేక మంది వచ్చి వాటిని పరిశీలించారు. పనిముట్ల కోసం లబ్ధిదారుల వాటా కింద పది శాతం మొత్తాన్ని డీడీలు తీయాల్సి ఉన్నా చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. దీంతో జిల్లాలోని అనేక మండలాల్లో ఉన్న వెనకబడిన వర్గాల వారిని సంబంధిత మండల స్థాయి అధికారులు బతిమాలుతున్నారు. బాబ్బాబు డీడీలు తీసి బీసీ కార్పొరేషన్‌ కార్యాలయంలో అందించాలని కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. డీడీలు సమర్పిస్తేనే సంబంధిత దరఖాస్తుదారునికి ప్రొసీడింగ్‌ ఆర్డర్స్‌ ఇస్తారు. కానీ మండల స్థాయిలో అధికారులు మొత్తుకుంటున్నా డీడీలు తీయడానికి లబ్ధిదారులు విముఖత చూపుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

అంతా ఆర్భాటం
ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఆర్భాటం చేసి.. ఆచరణలో ఆలస్యం చేయడంపై బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. కేవలం ప్రచార స్టంట్‌ కోసం గ్రౌండింగ్‌ పేరుతో షో చేసినా పనిముట్లు అందించడంలో తాత్సారం చేస్తుండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఆదరణపై ప్రభుత్వంలో ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ పథకాన్ని ప్రవేశ పెట్టి తద్వారా బీసీ వర్గాల మన్ననలు పొందాలని భావించింది. అయితే ఆ వర్గాల నుంచి నిరాసక్తత ఎదురు కావడంతో కంగుతింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రవేశపెట్టిన పథకం లక్ష్యాలు పూర్తిగాక మునుపే మళ్లీ ఆదరణ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఎవరైనా ఆదరణ పథకానికి డీడీలు తీయకపోతే అలాంటి వారి చేత మళ్లీ దరఖాస్తు చేయించాలనే యోచనలో ఉన్న ట్లు తెలుస్తోంది. ఈ గ్రౌండింగ్‌ మేళా కార్యక్రమాన్ని డిసెంబరు ఆఖరు వరకు విడతల వారీగా నిర్వహిం చే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ప్రచారం పొందడానికి ఎత్తుగడ వేసినట్లుగా స్పష్టమవుతోంది.

పనిమట్లు వస్తున్నాయి
ఇప్పటికే చాలామందికి పనిముట్లను అందజేశాము. మరికొన్ని యూనిట్లు వస్తున్నాయి. పనిముట్ల సరఫరాలో జాప్యం కారణంగా అవాంతరం ఏర్పడుతోంది. చేనేతలు, మత్స్యకారులకు సంబంధించిన పనిముట్లు రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. పనిముట్లన్నీ నాణ్యతతో కూడుకున్నవే. అందులో నాణ్యత లేదని వస్తున్న ప్రచారం అవాస్తవం. ఈ పనిముట్లను, వాటి మోడళ్లను లబ్ధిదారులే ఎంపిక చేసుకున్నారు. వారు ఎంపిక చేసుకున్న పనిముట్లను మేము అందిస్తున్నాం. మిగతా లబ్ధిదారులు డీడీలు తీయగానే పనిముట్ల మంజూరుకు చర్యలు చేపడతాం.    – నరసింహారెడ్డి,    ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, జిల్లా బీసీ కార్పొరేషన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top