పుట్టిన రోజే ఆత్మహత్య

9th class student committed suicide in kurnool district - Sakshi

రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య 

చదువుకోవడం ఇష్టం లేదని సూసైడ్‌ నోట్‌

కర్నూలు / వెల్దుర్తి: తనకు చదువుకోవడం ఇష్టం లేదని.. అయినా నాన్న చదువుకోమంటూ బలవంతపెడుతున్నాడు.. దీంతో చనిపోవాలనుకున్నాను.. అదీ పుట్టిన రోజు నాడే అని తొమ్మిదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలు.. మండల పరిధిలోని కలుగొట్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చింతమాను రాముడుకు మొదటి భార్య సరోజ మృతి చెందగా ఆమె చెల్లెలు రాములమ్మను వివాహం చేసుకున్నాడు. సరోజకు ఒక కుమార్తె, కుమారుడు.

 కుమార్తె పాణ్యం గురుకులంలో పదో తరగతి చదువుతుండగా కుమారుడు చంద్ర(14) కలుగొట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం రాత్రి చంద్ర ఇంట్లోంచి బయటకు వచ్చి ఆదివారం ఉదయం వెల్దుర్తి పట్టణ పరిధిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, అయ్యప్పస్వామి గుడి మధ్య, కర్నూలు వైపు అండర్‌వేబ్రిడ్జ్‌ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. స్థానిక హైస్కూల్లో జరుగుతున్న క్రికెట్‌ పోటీలకు వచ్చిన పలు గ్రామాల యువకులు విషయం తెలుసుకొని సంఘటనా స్థలికి వెళ్లారు.

 కలుగొట్ల గ్రామ యువకులు మృతుడిని గుర్తించారు. మృతదేహం సమీపంలో సూసైడ్‌ నోట్‌ లభించింది. ఆదివారం తెల్లవారుజామున రైలు కింద పడి చనిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కర్నూలు రైల్వే ఎస్‌ఐ ఆనందరావు, హెచ్‌సీ ఏడుకొండలు, రైటర్‌ కృష్ణమోహన్‌ రెడ్డి, సిబ్బంది కిరణ్‌ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామని ఎస్‌ఐ చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top