6వ రోజు పాదయాత్ర డైరీ

6th day padayatra dairy - Sakshi

12–11–2017, ఆదివారం
దువ్వూరు, వైఎస్సార్‌ జిల్లా

నేతన్నల తలరాత మార్చాల్సిందే
ప్రొద్దుటూరు నుంచి ఆరో రోజు యాత్రను ఉదయం 8.30కి ప్రారంభించాను. బయల్దేరడానికి ముందు గుర్తుకొచ్చింది. ఇక్కడికి సమీపంలోనే కలమల అనే గ్రామం ఉంది. యర్రగుంట్ల మండల పరిధిలోకి వస్తుంది. రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఇక్కడే ఉంది. తెలుగు భాషలో మొట్టమొదటి శాసనం లభించింది ఈ గ్రామంలోనే. ఆరోశతాబ్ద కాలం నాటిది. తెలుగు భాష  ప్రాచీనతకు తిరుగులేని సాక్ష్యంగా నిలబడిందీ శాసనం. తెలుగుభాషా యశస్సును నలుదిక్కులా చాటి చెప్పేలా, మాతృభాషాభిమానులకు మనోరంజకమయ్యేలా అక్కడొక మెమోరియల్‌ను ఏర్పాటు చేయాలని ఉంది. రాయలసీమలో ఒక ముఖ్య వాణిజ్య పట్టణం ప్రొద్దుటూరు. నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధివైపు వడివడిగా అడుగులు వేసింది. ఆ తర్వాత పూర్తిగా పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యింది. ఆ నిర్లక్ష్యం తాలూక ముద్రలు పట్టణంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలి. ప్రొద్దుటూరును అభివృద్ధి పట్టాల మీదకు ఎక్కించాలి. 

నడక మొదలైన తర్వాత పెద్దలు ఎమ్వీ రమణారెడ్డి గారు వచ్చి అభినందించి వెళ్లారు. వారికి ధన్యవాదాలు. ప్రజా స్పందన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదనిపిస్తోంది. అదే వెల్లువ కొనసాగింది. గ్రామాల వెంట ఒక్కరోజు కాలినడకన తిరిగొచ్చినా చాలు, ఈ ప్రభుత్వం ఎంత ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుందో తెలుసుకోవచ్చు. ప్రొద్దుటూరు పరిసరాల్లో చేనేతన్నలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నాన్నగారు వారి కోసం అభివృద్ధి చేసిన కాలనీకి ఈ రోజు వెళ్ళాను. వారి స్థితిగతులు తెలుసుకున్నాను. వారిలో చాలామందికి పింఛన్లు రావడం లేదు. మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర రోజంతా కష్టపడ్డా రెండొందలు కూడా రావట్లేదన్నారు. పిల్లల చదువులు కూడా సాగడం లేదన్నారు. నాకు చాలా బాధ కలిగింది. మనసు బరువెక్కింది. పనిలో నైపుణ్యం లేక కాదు వీళ్లకీ పరిస్థితి. ఆసరా లేక, అండ లేక, ఇప్పుడున్న పాలకులకు చిత్తశుద్ధి లేక. నేతన్నల తలరాత మార్చి రాయాల్సిందే. ఒక్క ప్రొద్దుటూరే కాదు, చాలా ప్రాంతాల్లో చేనేత కార్మికులు సంక్షోభ స్థితిలో చిక్కుకున్నారు.

ఆంధ్ర చేనేతకు చాలా చరిత్ర ఉంది. వెయ్యేళ్లకు పూర్వమే మన దగ్గర తయారైన వస్త్రం ఓడల ద్వారా ఖండాతరాలకు ఎగుమతయ్యింది. ఇప్పుడు కూడా పనితనంలో మన చేనేత కళాకారులు ఎవరికీ తీసిపోరు. అవకాశాలు వరించి వస్తే ఆకాశాన్ని ముద్దాడగల ప్రతిభావంతులు మన నేతన్నలు. వైఎస్‌గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో హ్యాండ్లూమ్‌ పార్క్‌ ఏర్పాటుకు 76 ఎకరాల స్థలం కేటాయించారు. అనుబంధ పరిశ్రమలతో కూడిన ఒక చేనేత క్లస్టర్‌ని అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నించారు. ఆయన దూరమైన తరువాత ఆ ప్రయత్నమూ దూరమైంది. ఎన్నికలకు ముందు ఇప్పటి ముఖ్యమంత్రి వీరికి చాలా వాగ్దానాలు చేశారు. ఆ తర్వాత వాటన్నిటికీ నీళ్లొదిలారు. 

ప్రొద్దుటూరు శివారు దాటేసరికి మధ్యాహ్నమైంది. భోజనానంతరం మైదుకూరు నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించి సాయంత్రం 6 గంటలకు దువ్వూరు మండల కేంద్రానికి చేరుకున్నాము. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల అక్రమ ఇసుక వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగిపోతోంది. వారు తవ్విన గుంతల్లో పడి ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కూడా వైఎస్సార్‌ హయాంలో జరిగిందే.  ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రెండు పంటలకు నీరిచ్చేవారు. ఆగస్టులో రావాల్సిన నీరు ఇప్పుడు నవంబర్‌లో వస్తోంది. గత రెండేళ్లుగా అది కూడా లేదు. కుందూ నదిపై రాజోలి రిజర్వాయర్‌ నిర్మించడానికి వైఎస్‌ ప్రభుత్వం 2008లోనే అనుమతులు సాధించింది. ఆ ప్రాజెక్టు పూర్తయితే కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణ జరిగి రెండు పంటలూ హాయిగా పండేవి. పంటలు పండినా గిట్టుబాటు కాని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. ఖర్చులు కూడా రాక రైతులు విలవిల్లాడుతున్నారు. రుణమాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు వాళ్లు రుణాల కోసం బ్యాంకుల గడప కూడా తొక్కలేని పరిస్థితి. 

ఈ సాయంత్రం దువ్వూరులో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ రోజు మొత్తం 15.8 కిలోమీటర్లు నడిచాము. బసకు చేరుకోగానే హృదయవిదారకమైన వార్త తెలిసింది. విజయవాడలో జరిగిన బోటు ప్రమాదంలో 17 మంది చనిపోయి, మరో ఏడుగురు గల్లంతయ్యారని అంటున్నారు. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్ళి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని పార్టీ సీనియర్‌ నాయకులకు చెప్పాను.  
- వైఎస్‌ జగన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top