234వ రోజు పాదయాత్ర డైరీ

234th day padayatra diary - Sakshi

11–08–2018, శనివారం 
తుని, తూర్పుగోదావరి జిల్లా

అగ్రిగోల్డ్‌ ఆస్తులపై కన్నేసిన బాబుగారి వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందనుకోవడం అత్యాశే
ఈరోజు తుని నియోజకవర్గంలోని కొత్తవెలంపేట, లోవకొత్తూరు, జగన్నాథగిరి, తుని పట్టణంలో పాదయాత్ర సాగింది. ఆర్థిక మంత్రి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు మాత్రం ఆర్థికంగా ఎదిగారే తప్ప.. ప్రజల ఆర్థిక స్థితిగతులు మరింత దిగజారిపోయాయి. ఓ వైపు వనరుల్ని దోచేస్తూ.. మరోవైపు ప్రజల్ని పీడిస్తూ.. అరాచక పాలన సాగుతోందిక్కడ. దేవుడి భూములు, నదులు, చెరువులు, కొండలు సైతం ఇక్కడి అనకొండ సోదరుల అవినీతికి స్వాహా అవుతున్నాయి. చిత్రమేమిటంటే.. ఒకప్పుడు స్పీకర్‌ స్థానంలో ఉండి.. అసెంబ్లీలో రామారావుగారికి మైక్‌ ఇవ్వకుండా అవమానపరిచారు. నేడు అదే రామారావుగారి విగ్రహాల పేరుతో నిరుపేదల పింఛన్ల నుంచి రూ.500 చొప్పున దౌర్జన్యంగా వసూలు చేశారట.

ఇదే తునిలో జరిగిన కాపు గర్జన సందర్భంగా అమాయక కాపు సోదరులతో పాటు.. ఉద్యమంతో సంబంధమే లేని బీసీలు, ఎస్సీలు, దివ్యాంగులు, మహిళలపై సైతం అక్రమ కేసులు బనాయించి నేటికీ వేధిస్తున్నారు.  

ఉదయం వందలాదిగా తరలివచ్చిన అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లు.. సంస్థ మోసం వల్ల తమ తలరాతలు తలకిందులైన వైనాన్ని వివరించారు. న్యాయం చేస్తానని నమ్మబలికి ద్రోహం చేస్తున్న చంద్రబాబుపై మండిపడ్డారు. బాబుగారి పాలన ముగియవస్తున్నా.. కాస్తయినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ ఆస్తులపై కన్నేసిన బాబుగారి వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందనుకోవడం అత్యాశే.  

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్‌టీచర్లు కలిశారు. వారంతా ఎంఏ, బీఈడీ.. ఎంకామ్, బీఈడీలు చదివారు. ‘సార్‌.. పేరుకే పెద్ద చదువులు.. పదేళ్లుగా పనిచేస్తున్నా జీతం మాత్రం ఏడువేలే. మాకన్నా దినసరి కూలీలే నయం’అంటూ బాధపడ్డారు. చదువులు చెప్పే గురువుల పరిస్థితి ఇంత దీనంగా ఉంటే.. ఇక వారు పిల్లలకెలా పాఠాలు చెప్పగలరు? 

దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూము ల్ని పారిశ్రామికవాడ పేరుతో బలవంతంగా లాక్కుంటున్నారని కొత్తవెలంపేట, రాజుపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు ప్రజలు.. పాలకుల భూదాహంపై ధ్వజమెత్తారు. పెద్ద భూస్వాము లు, పలుకుబడి ఉన్న బడాబాబుల భూముల జోలికి పోని ప్రభుత్వం.. ఎకరా, అరెకరా సాగు చేసుకుంటూ భారంగా బతుకులీడుస్తున్న పేదల భూముల్ని గద్దల్లా తన్నుకుపోతోంది.  

జగన్నాథగిరికి చెందిన సుజాత అనే సోదరి తన పదేళ్ల బిడ్డ మణికంఠతో వచ్చి కలిసింది. పేదరాలైన ఆ సోదరికి పెద్ద కష్టమే వచ్చింది. ఆ బాబుకు ‘హీమోఫిలియా’అనే రక్తసంబంధ జబ్బు. రక్తం గడ్డకట్టదు.. చిన్నగాయమైనా రక్తస్రావం ఆగదు. ప్రతి 15, 20 రోజులకు ఖరీదైన వైద్యం చేయించుకోవాలి. ప్రభుత్వాస్పత్రుల్లో మందులు అందక.. వేలకు వేలు డబ్బులు ఖర్చుపెట్టుకోలేక, బిడ్డ బాధ చూడలేక.. బతుకొక నరకంగా అనిపిస్తోందంటూ కంటతడి పెట్టింది. అంత దుఃఖంలో సైతం ‘అన్నా.. మన ప్రభుత్వం వచ్చాక ఏ బిడ్డకూ వైద్యం అందని కష్టం రాకూడదు. ఏ తల్లీ నాలా బాధపడకూడదు. అందరికీ ప్రభుత్వాస్పత్రుల్లో మందులు అందేట్లు చూడన్నా’అని కోరింది. ఆ తల్లి పెద్ద మనసుకు మనసులోనే దణ్ణం పెట్టుకున్నాను. ఆర్థిక స్థోమత లేని కారణంగా పేదలెవ్వరికీ మెరుగైన వైద్యం దూరం కారాదన్న నా సంకల్పం మరింత బలపడింది. తునిలో జరిగిన భారీ బహిరంగ సభతో నేటి పాదయాత్ర ముగిసింది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాలుగున్నరేళ్లుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తానని చెబుతూనే ఉన్నారు. మీ పదవీకాలం పూర్తవబోతోంది.. ఏ ఒక్క బాధితుడికైనా న్యాయం చేశారా? కేవలం రూ.1,100 కోట్లతో దాదాపు 80 శాతం మందికి ఉపశమనం కలుగుతుందని బాధితులు చెబుతున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడాన్ని ఏమనుకోవాలి? అగ్రిగోల్డ్‌ నిందితులతో తెరచాటు మంతనాలు సాగించడంలో ఆంతర్యమేంటి? ఆ సంస్థ ఆస్తులపై కన్నేసి.. తమకు అన్యాయం చేస్తున్నారంటున్న రాష్ట్రంలోని 19.5 లక్షల బాధితులకు ఏం సమాధానం చెబుతారు? 
-వైఎస్‌ జగన్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top