216వ రోజు పాదయాత్ర డైరీ

216th day padayatra diary - Sakshi

19–07–2018, గురువారం
జేఎన్‌టీయూ సెంటర్‌ (కాకినాడ), తూర్పుగోదావరి జిల్లా

దేవుడి మాన్యాలైనా, శ్మశానవాటికలైనా.. పచ్చ నేతల భూదాహానికి ఒకటే!
ఈ రోజు కాకినాడ పట్టణంలోని ఆదిత్య కాలేజీ సెంటర్, మాధవనగర్, రంగరాయ మెడికల్‌ కాలేజీ, జేఎన్‌టీయూ మీదుగా పాదయాత్ర సాగింది. మహిళలు, పిల్లలు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జేఎన్‌టీయూ మీదుగా పాదయాత్ర సాగినప్పుడు ఆ విద్యాసంస్థకు యూనివర్సిటీ హోదా కల్పించిన నాన్నగారిని కళాశాల సిబ్బంది గుర్తు చేసుకున్నారు.   బాబుగారి ఏలికలో నిరంతరం అభద్రతాభావంతో కొలువులు చేస్తున్నామంటూ ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు కలిసి కష్టాలు చెప్పుకున్నారు.

ఉద్యోగ భద్రత లేదంటూ.. జేఎన్‌టీయూ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, పారిశుద్ధ్య పనులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమను చినబాబుగారు రోడ్డున పడేస్తున్నారంటూ.. పంచాయతీ వర్కర్లు, పదేళ్లుగా పనిచేస్తున్నా ఎప్పుడేం జరుగుతుందో, ఎవరిని తొలగిస్తారో అర్థం కాని అభద్రత తమదంటూ.. మెడికల్‌ కాలేజీ వద్ద కలిసిన గవర్నమెంటు ఐటీఐ, డీఎల్‌టీసీ సిబ్బంది, డీఎస్సీల ద్వారా రోస్టర్‌ విధానం ప్రకారం నియామకం పొంది, పదిహేడేళ్లుగా పనిచేస్తున్నా రెగ్యులరైజ్‌ చేయడంలేదంటూ.. ఆరోగ్యశాఖలోని ఫార్మసిస్టులు, కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదంటూ.. మాధవనగర్‌లో కలిసిన విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, ఐదు నెలలుగా జీతాలే లేవంటూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న బీఎస్సీ నర్సింగ్‌ ఉద్యోగినులు వినతిపత్రాలు అందించారు.

అందరిదీ ఒకటే వేదన.. ఉద్యోగ భద్రత, వేతన భద్రత లేవని, వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, బూటకపు హామీలిచ్చి మోసం చేశారని. అందరిదీ ఒకటే అభిప్రాయం.. నాన్నగారు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చెయ్యాలని అనునిత్యం పరితపిస్తే.. బాబుగారు వారిని ఎలా తొలగించాలా.. అని చూస్తున్నారని.అధికార పార్టీ నేతల భూదాహానికి శ్మశానం సైతం స్వాహా అవుతోందన్నారు.. గంగనాపల్లి దళిత సోదరులు. తరాలుగా తాము శ్మశానంగా వాడుకుంటున్న భూమిపై పచ్చనాయకుల కన్ను పడిందని, మరుభూమిని కూడా కబళించే నీచానికి ఒడిగడుతున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాపభీతి లేని బాబుగారి పాలనలో పచ్చ నేతల భూదాహానికి దేవుడి మాన్యాలైనా, శ్మశానవాటికలైనా ఒకటే!  

వేట నిషేధ కాలమైన మే, జూన్‌ నెలల్లో మత్స్యకార కుటుంబాలకు చేయూతగా ఇచ్చే రూ.4,000 పరిహారంఇప్పటికీ అందలేదని మత్స్యకార సోదరులు వాపోయారు. ఎప్పుడొస్తుందో తెలీదు.. అసలు వస్తుందో రాదో తెలీదు.. గతేడాది పరిహారమే ఇంకా చాలా మందికి రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. దమ్మాలపేట గంగపుత్రులు. వేటకు వెళితేగానీ పూటగడవని తమకు.. నిషేధ సమయంలో పరిహారం ఇవ్వకపోతే ఆ రెండు నెలలు ఎలా బతకాలంటూ.. తమ బతుకు కష్టం గురించి చెప్పుకున్నారు. తానిచ్చిన హామీలను గుర్తుచేసిన మత్స్యకార సోదరులను ‘తాటతీస్తా’.. అంటూ బెదిరించిన బాబుగారి పాలనలో వారి కష్టాలు తీరతాయనుకోవడం అత్యాశే.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని వసతులు, వనరులు కల్పిస్తూ.. సత్సంబంధాలు కలిగి, సుపరిపాలన అందిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మీ మేనిఫెస్టోలోని ఉపోద్ఘాతంలోనే గొప్పగా హామీ ఇచ్చారు. మీ 1,500 రోజుల పాలనలో.. ఒక్క కాంట్రాక్టు ఉద్యోగినైనా క్రమబద్ధీకరించారా? చాలీచాలని వేతనాలిస్తూ.. అవి కూడా నెలల తరబడి ఇవ్వకుండా.. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని అభద్రతను కలిగిస్తూ.. సుపరిపాలన ఎలా అందించగలరు? ప్రభుత్వోద్యోగాలే వ్యర్థమని మీ మనసులో మాటగా రాసుకున్న మీకు.. ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఎలా ఉంటుంది?

-వైఎస్‌ జగన్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top