214వ రోజు పాదయాత్ర డైరీ

214th day padayatra diary - Sakshi

17–07–2018, మంగళవారం 
కొవ్వాడ, తూర్పుగోదావరి జిల్లా 

ఇంకెంతకాలం ప్రజలను వంచిస్తారు బాబూ? 
ఈరోజు అనపర్తి నియోజకవర్గంలోని కరకుదురు, అచ్యుతాపురత్రయం, రామేశ్వరం గ్రామాల్లోనూ.. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కొవ్వాడ గ్రామంలోనూ పాదయాత్ర సాగింది. కొవ్వాడ వద్ద జోరున కురుస్తున్న వర్షంలోనే కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన వేలాది మంది ఆత్మీయులు ఘన స్వాగతం పలికారు.  

తాళ్లరేవుకు చెందిన సోదరి వీరవేణి ఏడాది వయసున్న బిడ్డను ఎత్తుకొని వచ్చింది. వాళ్లది నిరుపేద మత్స్యకార కుటుంబం. ఓవైపు బతుకు పోరాటమే కష్టంగా సాగుతున్న ఆ కుటుంబంలో.. ఏడాది బిడ్డకు బ్లడ్‌ కేన్సర్‌ అని నిర్ధారణయ్యింది. తల్లడిల్లిపోయిన ఆ తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఇక్కడ వైద్యం లేదని తెలిసి వేలూరు సీఎంసీకి వెళ్లారట. చికిత్సకు రూ.14 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో వారి గుండెల్లో రాయి పడ్డంత పనైంది. మొక్కని దేవుడు లేడు. చేయని ప్రయత్నమూ లేదు. ఆరోగ్య శ్రీ వర్తించదట. అమలాపురానికి సీఎం గారు వస్తే ఆయన్ని కూడా కలిశారట.

ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు కాగితాలపై సంతకం పెట్టారట. కానీ నెలలు గడిచిపోతున్నా ఆ సాయం మాత్రం అందడం లేదట. రోజురోజుకూ బిడ్డ పరిస్థితి విషమిస్తోంది. ప్రధానమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేద్దామంటే రేషన్‌కార్డు లేదట. నాలుగేళ్లుగా కార్డు కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా రాలేదట. ఇదీ... మనసంతా కలిచివేసిన ఆ తల్లి కన్నీటి కథ. ఓవైపు ఆరోగ్య శ్రీ వర్తించదు. మరోవైపు ముఖ్యమంత్రి సహాయనిధి రాదు. పోనీ ప్రధానమంత్రి సహాయ నిధికి ప్రయత్నిద్దామంటే రేషన్‌ కార్డు ఇవ్వరు. మన రాష్ట్రంలో పెద్ద జబ్బు చేస్తే పేదవాడి పరిస్థితి ఇది. ‘‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌.. ఆనంద ఆంధ్రప్రదేశ్‌’’ అంటూ కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి, ప్రకటనలు గుప్పిస్తున్న బాబు గారికి ఇలాంటి నిరుపేద తల్లుల గుండెకోత కనిపించడం లేదా? 

ఉదయం కొప్పవరం గ్రామస్తులు కలిశారు. టీడీపీ ప్రభుత్వం వస్తూనే వారి గ్రామంలో 75 మందికి పెన్షన్లు తీసేశారట. వారు దాని మీద పోరాటం చేసి కోర్టు దాకా వెళ్లారట. ఇదిలాఉండగానే కక్ష సాధింపునకు కొనసాగింపా అన్నట్లు అదే గ్రామంలో ఒకేసారి 40 మంది రేషన్‌కార్డులు తీసేశారట. ఇదంతా జన్మభూమి కమిటీల దుర్మార్గమే అంటూ మండిపడ్డారు ఆ గ్రామస్తులు. కలెక్టర్‌ దగ్గర మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఎలాంటి చలనమూ లేదంటూ వారు నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.  

ఓవైపు కొత్త రేషన్‌కార్డులు మంజూరు కాక, కన్నబిడ్డ విషమ పరిస్థితిలో ఉన్నా ఏ ప్రభుత్వ సాయానికీ నోచుకోక వీరవేణి లాంటి తల్లులు కడుపు కోత అనుభవిస్తుంటే.. మరోవైపు ఉన్న కార్డులు ఊడిపోయి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం తన 1,500 రోజుల పాలనలో అర్హులైన వారందరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు ఇచ్చేశామని.. ప్రజలంతా ఆనందంగా ఉన్నారని అసత్య ప్రచారాలు చేసుకోవడం సిగ్గుచేటు.  

అదే కొప్పవరం గ్రామానికి చెందిన బులి మోహన్‌రెడ్డి నన్ను కలిసి వడ్డీ లేని పంట రుణాలంటూ ఈ ప్రభుత్వం రైతుల్ని వంచిస్తోందని చెప్పాడు. అందుకు తన కథే ఉదాహరణ అన్నాడు. ఆ సోదరుడు గతేడాది బ్యాంకులో రూ.30 వేలు పంట రుణం తీసుకున్నాడట. సంవత్సరం పూర్తి కాకుండానే తిరిగి ఆ రూ.30 వేలు బ్యాంకులో కట్టేశాడట. బ్యాంకులో పెట్టిన పత్రాలు ఇమ్మంటే.. వడ్డీ కట్టాలి, కడితేనే ఇస్తామనేది బ్యాంక్‌ వాళ్ల సమాధానం. వడ్డీ లేని రుణం కదా అని అడిగితే.. ప్రభుత్వం వడ్డీ డబ్బులు ఇవ్వడం లేదంటూ అసలు విషయం చెప్పారు బ్యాంక్‌ వాళ్లు. ‘‘అన్నా.. వడ్డీ లేని పంట రుణమంతా బోగస్‌’’ అంటూ తను వడ్డీతో సహా బ్యాంకులకు కట్టిన రశీదులు, లోన్‌ స్టేట్‌మెంట్‌ తదితర ఆధారాలతో బాబు గారి మోసాన్ని బయటపెట్టాడు ఆ సోదరుడు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రేషన్‌ కార్డుల కోసం, పెన్షన్ల కోసం పేద ప్రజలు కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి.. సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దుస్థితి.. చరిత్రలో ఎప్పుడైనా ఉందా? అది ఒక్క మీ పాలనలోనే ఉండటం వాస్తవం కాదా? అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు ఇచ్చేశామని, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని ప్రకటనలు ఇచ్చుకుంటూ ఇంకెంతకాలం ప్రజలను వంచిస్తారు?
-వైఎస్‌ జగన్‌      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top