167వ రోజు పాదయాత్ర డైరీ

167th day padayatra diary - Sakshi

21–05–2018, సోమవారం
పెంటపాడు, పశ్చిమగోదావరి జిల్లా

ఇదీ.. చంద్రబాబు పాలనలో వైద్యారోగ్య వ్యవస్థ దీనావస్థ
శ్రేయోభిలాషి, బహుముఖ ప్రజ్ఞాశాలి దువ్వూరి సోమయాజులుగారి పార్థివ దేహానికి నివాళులర్పించి.. రాత్రి తిరిగి పాదయాత్ర శిబిరానికి చేరుకున్నాను. ఆ విజ్ఞానపు వెలుగు, ఆ మార్గనిర్దేశకత్వం ఇకలేవన్న చేదు నిజం మనసును తొలుస్తుండగా.. ఈ రోజు ఉదయం పాదయాత్ర మొదలెట్టాను. 

నిరుపేద కుటుంబానికి చెందిన వెంకట్రా వమ్మ.. రెండు కిడ్నీలూ పాడైన తన కొడుకును తీసుకొచ్చింది. జన్మనిచ్చిన ఆ తల్లి తన కిడ్నీ ఇచ్చి పునర్జన్మ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ వైద్యసాయం అందించేదెవరు? మన రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాల్లేవు. హైదరాబాద్‌ లోనేమో ఆరోగ్యశ్రీ వర్తించదు. ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో కిడ్నీ ఆపరేషన్లు చేయలేమంటూ ప్రయివేటు ఆస్ప త్రులవారు చేతులె త్తేశారు. లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించలేని దీనస్థితి. చూస్తూ చూస్తూ కొడుకు ప్రాణాన్ని గాలికొదిలేయలేని దయనీయ పరిస్థితి. ఇదీ.. బాబుగారి ఏలుబడిలో సామాన్య ప్రజల దుస్థితి. 

మరోవైపు ప్రజారోగ్యానికి మూలస్తంభా లైన వైద్యులు, సిబ్బంది కలిశారు. సేవలం దించడానికి సిద్ధంగా ఉన్నా.. సదుపాయాల కొరత అడ్డుకుంటోందని ప్రభుత్వ వైద్యులు, సంవత్సరాల తరబడి బిల్లులే చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ కింద కేసులెలా చేస్తామని ప్రయివేటు డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగు లంటూ సంక్షేమ పథకాలు అందనీయరు.. పోనీ ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే పింఛన్లు, హెల్త్‌ కార్డులు తదితర సౌకర్యాలు కల్పించరు.. రెంటికీ చెడ్డ రేవడిలా ఉన్నామంటూ వైద్యారోగ్యశాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోయారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా రాక.. లక్షలు ఖర్చుపె ట్టుకుని డెంటల్‌ కోర్సు పూర్తిచేస్తే నియామకా ల్లేక.. ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలున్నా పట్టించు కోక.. అతి తక్కువ వేతనాలతో ప్రయి వేటు ఆస్పత్రులలో పనిచేయలేక.. సొంతంగా ప్రాక్టీసు పెట్టుకుందామంటే పెట్టుబడికి ఆర్థిక స్థోమత సరిపోక.. దిక్కుతోచని స్థితిలో పడ్డామంటూ దంత వైద్యులు ఆవేదన చెందారు. నెలల తరబడి రాని చాలీచాలని జీతాలు.. సంవత్సరాలు పనిచే సినా ఎదుగూబొదుగూ లేని జీవితాలు.. నిర్వహ ణ లోపం.. వాహనాల కొరత.. ప్రశ్నిస్తే వేధింపు లు.. ఎదిరిస్తే ఉద్యోగం నుంచి తొలగింపులు.. అవసాన దశలో ఉన్నాయి ఒకనాటి అద్భుత పథకాలు.. అంటూ 108, 104 సిబ్బంది ఆందో ళన వ్యక్తం చేశారు. ఇదీ.. చంద్ర బాబు పాలనలో జబ్బుచేసిన వైద్యారోగ్య వ్యవస్థ దీనావస్థ. పడకేసిన ఈ ఆరోగ్య వ్యవస్థను పునరుజ్జీవింప జేయాలన్న నా సంకల్పం మరింత బలపడింది. 

స్వాతంత్య్రం రాకపూర్వం నుంచే తాడేపల్లిగూడెం ప్రధాన కేంద్రంగా విలసిల్లు తోంది. అప్పటికే రోడ్డు, రైలు, జల రవాణా సౌకర్యాలుండటమే దీనికి కారణం. ఇప్పటికీ కర్నూలు ఉల్లికి కేరాఫ్‌ అడ్రస్‌ ఈ తాడేపల్లిగూడెం మార్కెట్టే. ఈ ప్రాంతంలో హమాలీలు, గోడౌన్‌ల లో పనిచేసే దినసరి కూలీలు, ఇతర అసంఘటిత కార్మికులు వేలాదిమంది ఉన్నారు. తమ జీవి తాలు గోడౌన్‌లలో, మార్కెట్లోనే తెల్లారిపోతున్నా యని.. పని ఉన్న రోజు నాలుగు వేళ్లు నోట్లోకి వెళతాయి.. లేని రోజులు పస్తులేనంటూ హమాలీ సోదరులు తమ కష్టనష్టాలు చెప్పుకొన్నారు. మూటలు మోస్తూ.. బరువులు ఎత్తుతూ.. చిన్న వయసులోనే కీళ్లు అరిగిపోయి.. శ్వాసకోశ జబ్బు లతో 40, 45 ఏళ్లకే అకాల వృద్ధాప్యం మీదపడు తోందంటూ.. తమ గుండెల నిండా గూడుకట్టు కున్న బాధను పంచుకున్నారు. భరోసా లేని ఆ బతుకు బాధలు వింటుంటే గుండె బరువెక్కింది. వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచనలతో అడుగులు ముందుకేశాను. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఆరోగ్య బీమా, సోషల్‌ సెక్యూరిటీ, వడ్డీలేని రుణాలు.. అంటూ మీ మేనిఫెస్టోలోని 31వ పేజీలో 15 హామీలిచ్చారు. వాటిని నెరవేర్చకపోవడం వంచన కాదా? రెక్కాడితేగానీ డొక్కాడని హమాలీలను, దినసరి కూలీలను, ఇతర అసంఘటిత కార్మికులను మోసం చేయడం పాపమనిపించలేదా? 
-వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top