లండన్: ఇటీవల ఆన్లైన్లో వస్తువులు కొంటున్న వారి సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలా కొనుగోలు చేసిన వాటిలో ఒకటికి బదులు వేరొక వస్తువులు కస్టమర్లు అందుకున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు ఆనలైన్లోనే కాకుండా కొన్ని సార్లు ఆఫ్లైన్ కస్టమర్లకు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆలూ చిప్స్ ప్యాకెట్ కొని తెరిచి చూడగా అందులో చిప్స్కు బదులు ఒక ఆలుగడ్డ ఉండడం చూసి షాక్ అయ్యాడు.
ఈ ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. లింకన్షైర్లోని ఉప్పింగ్హామ్ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడైన డేవిడ్ బాయ్స్ ఈ నెల 17న కెటిల్ చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ఎంతో ఆశగా చిప్స్ తినాలని ఆ ప్యాకెట్ తెరిచి చూడగా అందులో ఒక బంగాళదుంప గడ్డ మాత్రమే ఉండడం చూసి ఖంగుతిన్నాడు. షాక్లోంచి తేరుకుని దాన్ని ఫొటో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో పాటు ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు.
ఆ పోస్ట్కి క్యాప్షన్గా.. ‘నేను ఈ రోజు కెటిల్ చిప్స్ ప్యాకెట్ తెరిచాను. అందులో క్రిప్స్ కనిపించలేదు. కేవలం బంగాళాదుంప గడ్డ మాత్రమే ఉందని తెలిపాడు. దీనిపై సదరు సంస్థ స్పందిస్తూ అతనికి క్షమాపణలు చెప్పింది. ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలియదని.. ఆ ప్యాకెట్ను వారికి అందజేస్తే తమ బృందం నుంచి వివరాలు సేకరిస్తామంటూ రీట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా మారి సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: తల్లిదండ్రులకు షాకిచ్చిన చైనా.. ఇకపై పిల్లలు తప్పు చేశారో అంతే సంగతి..