కుర్రాళ్లు ‘ఆసియా’ను కొట్టేశారు

ఆసియా కప్‌ అండర్‌–19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత యువ జట్టు వరుసగా మూడోసారి విజేతగా నిలి చింది. శుక్రవారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్‌ 34 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ముందుగా భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేయగా... ఆ తర్వాత శ్రీలంక 48.4 ఓవర్లలో 239 పరుగులకే ఆలౌటైంది. హిమాన్షు రాణా (71; 6 ఫోర్లు, 1 సిక్స్‌), శుభ్‌మన్‌ గిల్‌ (70; 4 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించగా... శ్రీలంక ఆటగాళ్లు రెవెన్‌ కెల్లీ (62; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ కామిందు మెండిస్‌ (53; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. తన లెఫ్టార్మ్‌ స్పిన్‌తో కీలక వికెట్లు పడగొట్టిన భారత కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (4/37) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా... టోర్నీలో 5 మ్యాచ్‌లలో కలిపి 283 పరుగులు చేసిన హిమాన్షు రాణా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును గెలుచుకున్నాడు. గెలుపు కోసం 75 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచిన శ్రీలంక, 43 పరుగుల వ్యవధితో తమ చివరి 7 వికెట్లు కోల్పోయి పరాజయంపాలైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top