ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల హత్య

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హత్యలకు గురవుతుండటం, వారిపై దాడులు కొనసాగుతుండటంపై ఒకపక్క అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెుదలైన హత్యాకాండపై సర్కారును నిలదీస్తున్నారు. అరుునా సరే తెలుగుదేశం పార్టీ నేతల రక్తదాహం తీరడం లేదు. సర్కారు దన్నుగా తమ హత్యాకాండను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు.

గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు వైఎస్సార్ సీపీ నాయకులను దారుణంగా హతమార్చిన అధికార పార్టీ నేతలు.. తాజాగా గురువారం రాత్రి వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు గ్రామంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేట కొడవళ్ళు, గొడ్డళ్ళతో కిరాతకంగా నరికి చంపారు. దీంతో మేళ్ళవాగులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురువారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్ళిన సోదరులు బూసి చిన నాగిరెడ్డి (33), పెద నాగిరెడ్డి(35) లను టీడీపీ నేతలు నరికి చంపారు. ఎన్నికల సమయంలో సోదరులిద్దరూ వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేయడంతో కక్ష పెంచుకున్న అధికార పార్టీ నేతలు వారిని హతమార్చినట్టుగా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. తమ సహచరులు ఇద్దరు హత్యకు గురికావడంతో గ్రామంలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల హత్యలు నిత్యకృత్యం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని మేళ్లవాగుతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హత్యలు జరిగిన ప్రాంతం గ్రామానికి కిలోమీటరు దూరంలోని పొలాల్లో ఉండటంతో పలువురు పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్లి మృతదేహాలను గుర్తించారు. రెండు మృతదేహాల ముఖాలపై గొడ్డళ్ళు, వేటకొడవళ్ళతో నరికిన గాట్లు ఉన్నాయి. బొల్లాపల్లి పోలీసులు సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top