సోనియాకు కిరణ్, చంద్రబాబు కోవర్టులు: శ్రీకాంత్ రెడ్డి

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన 'సమైక్య శంఖారావం' సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు దిక్కుతోచక మాట్లాడుతున్నారని విమర్శించారు. కిరణ్కు చీము నెత్తురు ఉంటే నవంబర్‌ 1 లోపు అసెంబ్లీని సమావేశపరచాలని, లేదంటే సమైక్యద్రోహిగా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు.

సీఎం ఎలెక్షన్ ఏజెంట్గా మారి వందలాది ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. సాక్షి ప్రతినిధులపై అక్కసు వెళ్లగక్కిన కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్కస్లో జోకర్లా వ్యవహరించాడని విమర్శించారు. లగడపాటి మాట్లాడిన భాష సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. వైఎస్ఆర్ సీపీతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ ఎమ్మల్యే జేసీ దివాకర రెడ్డి విమర్శించడాన్ని తప్పుపట్టారు. ఎంపీ సీటు కోసం జేసీ సోదరుడు టీడీపీతో ఒప్పందం చేసుకోవడం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. నరేంద్ర మోడీ సభకు ప్రత్యేక రైళ్లు కేటాయించినంత మాత్రాన సోనియా గాంధీతో బీజేపీ కుమ్మక్కయినట్టేనా అంటూ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top