'ఈ దేశంలో నా మాట వినేవాడెవడూ లేడు'

తానెంత మొత్తుకున్నా ఈ దేశంలో తన మాట వినేవాడు ఎవడూ లేడని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజధాని నగరాన్ని నిర్ణయించే విషయంలో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ దేశంలో రాజు ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుందని అన్నారు. రాయలసీమ వాసులంతా తమ ప్రాంతంలో రాజధాని నగరం ఉంటే బాగుంటుందని భావిస్తున్నారని జేసీ చెప్పారు. మాచర్లను రాజధాని చేస్తే బాగుంటుందని అన్నారు. అయితే, తమ మాట నెగ్గదని.. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు తమ వద్దకు వచ్చినప్పుడు కూడా ఇదే విషయం చెప్పానని ఆయన తెలిపారు.

విజయవాడలో భూముల ధరలను విపరీతంగా పెంచేశారని, ఇప్పుడు అక్కడ ఎకరం భూమి విలువ దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఉందని దివాకర్ రెడ్డి అన్నారు. అలాంటప్పుడు అక్కడ రాజధానికి భూమి సేకరణ కూడా సమస్యే అవుతుందన్నారు. అక్కడ రాజధాని ఏర్పాటు సమస్యాత్మకం అవుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా బాధలు పడుతున్నారని, ఇప్పుడు మరో ఐదేళ్ల తర్వాత కొత్త రాష్ట్రానికి ఏం చేశామన్న విషయంలో మనం కూడా బాధపడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top