నీతిలేని రాజకీయమే ఫిరాయింపులు..!

నీతిలేని రాజకీయమే ఫిరాయింపులు..! - Sakshi


కొమ్మినేని శ్రీనివాసరావుతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు



విద్యార్థి నేతగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తుపాకి గుళ్లను సైతం ఎదుర్కొని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన తెలుగు ప్రముఖులు పొలసాని మురళీధరరావు. ఫిరాయింపులతో, ఎమ్మెల్యేల కొనుగోళ్లతో ప్రజాస్వామ్య వ్యవస్థను బజారులోకి ఈడ్చిన పార్టీ టీఆర్‌ఎస్‌ అనీ, ఏపీలో టీడీపీ దానికేమీ తీసిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల్లోని ఫిరాయింపులు నైతిక విలువలకు, రాజకీయ విలువలకు వ్యతిరేకమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తి పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మార్చడం, మంత్రి కావడం తుచ్ఛ రాజకీయం అని భావిస్తున్న మురళీధరరావు ‘మనసులో మాట’లో వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...



ఉస్మానియా యూనివర్సిటీలో మీపై తుపాకి గుళ్లు ఎందుకు పేల్చారు?

ఆ రోజుల్లో ఏబీవీపీకి, ఇప్పుడు మావోయిస్టు పార్టీగా పిలుస్తున్న నాటి పీపుల్స్‌వార్‌ పార్టీ విద్యార్థి సంఘం ఆర్‌ఎస్‌యూకు మధ్య గొడవలు జరిగేవి. ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. వర్సిటీలో ఏబీవీపీ ప్రభావం పెరిగింది. ఆర్‌ఎస్‌యూ కూడా తన ప్రభావాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేసింది. విద్యార్థి సంఘాల మధ్య గొడవలు, వర్గ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దాంట్లో భాగంగానే నేను వాళ్ల టార్గెట్‌నయ్యాను. ఆ ఘటన జరిగిన రోజు ఏ హాస్టల్‌ మెస్‌లో భోజనం చేసి బయటకు రాగానే నాపై కాల్పులు జరిపి, నా ఛాతీలో గుళ్లు దింపారు.  ఆసుపత్రికి చాలా త్వరగా వెళ్లగలిగాను కాబట్టి బతికాను. తర్వాత ఇక్కడ పనిచేయడం కష్టమై రాజస్తాన్‌ వెళ్లాను. కృష్ణకుమార్‌ అనే మారు పేరుతో మూడేళ్లు ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశాను. జాతీయ స్థాయిలో సంస్థలో పని చేయడానికి ఆ విధంగా అవకాశం లభించింది.



బీజేపీ అమెరికాకు వ్యతిరేకమా?

కాదు. అమెరికానే మారిందిప్పుడు. ప్రపంచీకరణనే అమెరికా ఇప్పుడు విడిచిపెట్టేసింది. ట్రంప్‌ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దూకుడుగా వచ్చిన ప్రపంచ వాణిజ్య సంస్థ ఈరోజు ముందుకెళ్లలేకపో తోంది. ప్రపంచీకరణ పేరుతో ముందుకెళ్లిన అనేక దేశాలు ఈరోజు పునరాలో చిస్తున్నాయి. ఇంగ్లండ్‌ ‘బ్రెక్సిట్‌’ అయింది. అమెరికాలో, యూరప్‌ లో, భారత్‌లో కూడా ప్రజలు ఇప్పుడు గత 20 ఏళ్లుగా అమలులో ఉన్న ఆర్థిక విధానా లకు అనుకూలంగా లేరు.



తెలంగాణ ఇచ్చినందుకు సంతోషమా? ఐదు సీట్లే వచ్చినందుకు బాధా?

బాధ ఉంది. అయితే సీట్ల కోసమే తెలంగాణ ఇవ్వాలని బీజేపీ ఎన్నడూ భావించలేదు.  ఇవ్వాళ కాకపోతే రేపయినా.. తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధిస్తుందని బీజేపీ నమ్మింది. తెలంగాణ రాష్ట్రం కోసం తన వంతు కృషి చేసింది. కేంద్రంలో ప్రధాన పాత్ర పోషిం చింది. అయితే వాస్తవంగా మేము  రాజకీయంగా అంత లబ్ధి పొందలేకపోయాం.



బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్‌ పాలన ఎలా ఉందని భావిస్తున్నారు?

తీవ్రమైన అసంతృప్తి ఉంది. పార్టీకి, నాకు, కేంద్రంలో ఉండే బీజేపీ నాయకత్వానికి  కూడా.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రచారానికి తప్పిస్తే ఎక్కడ కూడా ప్రజాప్రయోజనా లకు పెద్దపీట వేయటం లేదు. ఏమీ జరగటం లేదు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల విషయంలో ఏం జరుగుతోంది? ఒక్క ఎర్రవెల్లిలో తప్పితే.. ఇంకెక్కడున్నాయవి? ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ విషయంలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. కాలేజీలు ఇబ్బందుల్లో ఉన్నాయి. మౌలిక వసతుల కల్పనా రంగంలో ఉండే కాంట్రాక్టర్లను అడగండి వారే చెబుతారు... డబ్బులు రావట్లేదు, పనులు ఆగిపోయాయి, పనులు నడవటం లేదు, ప్రచారం తప్పిస్తే ఏం జరగటం లేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతకానితనాన్ని ప్రజల మధ్య నిలబెట్టి నిలదీసే ప్రతిపక్ష పార్టీ బీజేపీయేనని మీరు కూడా రేపు చూస్తారు.



తెలంగాణలో ఫిరాయింపులు జరిగాయి. బీజేపీని తప్పితే మిగతా అన్ని పార్టీలను ఆకర్షించారు కదా.

అది దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థను బజారులోకి ఈడ్చిన పార్టీ టీఆర్‌ఎస్‌. ఎమ్మెల్యేలను నిర్భయంగా రోడ్డు మీద  కొనడం, కొని తెచ్చుకున్న వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం జరిగిపోతున్నాయి. ఈ విషయంలో గవర్నర్‌  విచక్షణను కూడా పూర్తిగా ప్రశ్నిస్తున్న రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి. బీజేపీ ఫిరాయింపు లను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఏ పార్టీ చేసినా ఇది మంచి పద్ధతి కాదు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్మకానికి సిద్ధంగా లేరు. కాంట్రాక్టులకు సిద్ధంగా లేరు.



ఫిరాయించడానికి ఎంతకు బేరం కుదిరింది, ఎంత మొత్తాలకు అమ్ముడు పోయారని మీ అంచనా?

కచ్చితంగా.. బేరం కుదిరే వెళ్లారు. అది బహిరంగంగా కనబడుతోంది. ఇది నైతిక విలు వలకు, రాజకీయ విలువలకు వ్యతిరేకం. దీన్ని కనుక మీరు సమర్థిస్తే, పాత రోజుల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిందాన్ని కూడా సమర్థించినట్లే. ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తి రాజీనామా చేయకుండా పార్టీ మార్చడం, మంత్రి కావడం, ఇదెక్కడి రాజకీయం?



మరి మీ మిత్రపక్షం టీడీపీ ఏపీలో చేసినదాన్ని మీరేమంటారు? చంద్రబాబూ! మీరు చేస్తున్నది తప్పు అని ఎన్నడైనా అన్నారా..?

ఎవరు ఎక్కడ చేసినా తప్పు తప్పే. చంద్రశేఖరరావును ఆదర్శంగా తీసుకుని చేసిన ఏ పనైనా తప్పే.. ఇక్కడ జరిగిందే అక్కడా జరిగినట్లే. ఎక్కడైనా రాజకీయ విలువలకు విరుద్ధంగా జరిగిందే. వారు అమ్ముడు పోయినట్లుగానే భావించాలి. ఎమ్మెల్యేలను కొనడం, అమ్మడం, ఎమ్మె ల్యేలు పార్టీలు మార్చడం వంటివి పొగుడుకునే విషయాలు కావు. సిద్ధాంత పరంగా ఫిరాయింపులను అక్కడా, ఇక్కడా వ్యతిరేకించాం. మా వైఖరిని స్పష్టంగా చెబుతున్నాను. ఎక్కడ ఫిరాయింపులు జరిగినా అది తప్పే. అరుణాచల్‌లో మెజారిటీ సభ్యులంతా కలసే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అది చట్ట విరుద్ధం కాదు.



నంద్యాల ఎంపీ, మరొక ఎంపీ కొత్తపల్లి గీత ఫిరాయించారు. అనర్హత నోటీసిచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా చర్యల్లేవు కదా?

ఫిరాయింపుల విషయంలో అనేక లూప్‌ హోల్స్‌ ఉన్నాయి. ఇబ్బందులు వస్తు న్నాయి. ఈ విషయంలో పూర్తిస్థాయి సంస్కరణ అవసరం. అటల్‌ బిహారీ వాజ్‌పేయి కాలం నుంచి నేటి దాకా ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక రాజకీయ పార్టీ మాది.



చంద్రబాబు ప్రభుత్వం వంటి అవినీతి ప్రభుత్వం లేదని ఏపీ బీజీపీ నేతే అన్నారు కదా?

బీజేపీకి ఆ ఆలోచన ఉండి ఉన్నట్లయితే, ఆ కూటమిలో మేం ఉండే అవకాశమే లేదు.



వెంకయ్యనాయుడు, చంద్రబాబుల స్నేహం రాజకీయాలకు అతీతంగా జరుగుతోందం టున్నారు.. నిజమా, కాదా?

స్నేహం, సంబంధం  వ్యక్తిగతమైన విషయం. అది ఎవరికైనా ఉండవచ్చు. నేను స్వదేశీ జాగరణ్‌ ఉద్యమంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ వంటి వారితోనే నాకు సంబంధం ఉండవచ్చు. అలాంటివి సహజం. కానీ బీజేపీకి, టీడీపీకీ ఉన్న ఒప్పందం ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత అవగాహన కారణంగానే ఉంది అనేది నేను ఒప్పుకోను. మా  పార్టీ దీన్ని అనుమానంతో చూడలేదు.

ఒకప్పుడు మోదీని నరహంతకుడు అని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఇద్దరికీ స్నేహం కలిసింది కదా. పాత విషయాలను గుర్తు పెట్టుకుంటే కుటుంబాలు నడవవు. భార్యాభర్తల కాపురం కూడా నడవదు. పాతవిషయాలు కొన్నింటిని మర్చిపోవాలి. దేశం దృష్ట్యా, ప్రజల దృష్ట్యా,  రాజకీయాల దృష్ట్యా, భవిష్యత్తు దృష్ట్యా మర్చిపోవాలి.

 

ఫిరాయింపులు ఎవరు ఎక్కడ చేసినా తప్పే. చంద్రశేఖరరావును ఆదర్శంగా తీసుకుని చేసినా తప్పు తప్పే.. ఇక్కడ జరిగిందే అక్కడా జరిగినట్లే. ఎక్కడైనా అది రాజకీయ విలువలకు విరుద్ధమే. ఎమ్మెల్యేలను కొనడం, అమ్మడం, ఎమ్మెల్యేలు పార్టీలు మార్చడం వంటివి పొగుడుకునేవేమీ కావు. సిద్ధాంత పరంగా ఫిరాయింపులను అక్కడా, ఇక్కడా మేం వ్యతిరేకించాం. మా వైఖరిని స్పష్టంగా చెబుతున్నాను.. ఫిరాయింపులు ఎక్కడ జరిగినా తప్పే.



ఇంటర్వూ్య పూర్తి పాఠాన్ని కింది లింకులలో చూడండి

https://goo.gl/3g2dWJ

https://goo.gl/Op64e4




 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top