అధికార దుర్వినియోగ వర్సిటీలు..!

అధికార దుర్వినియోగ వర్సిటీలు..!


విశ్లేషణ

అకడమిక్‌ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదించని విధానాన్ని ఒక అధికారి ఏవిధంగా అమలు చేస్తారు? పార్లమెంటు రూపొందించిన చట్టానికి వ్యతిరేకంగా ఒక అంతర్గత విధానాన్ని తయారు చేస్తే ఎలా చెల్లుతుంది అని కూడా పరీక్షించలేదు.



ఒక పది రూపాయలకోసం లక్షల రూపాయల ప్రజల డబ్బు ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకాడకపోవడం ప్రభుత్వ కార్యాలయాలకు అలవాటైంది. యూనివర్సిటీలు కూడా అదే రకంగా వ్యవహరించడం మరీ విచారకరం. ఢిల్లీ యూనివర్సిటీ సమాచార వ్యతిరేక వ్యవహారాన్ని చాటుకుంది. శ్రేయస్కర్‌ అనే వ్యక్తి 2013లో ఎంబీఏ పార్ట్‌ టైం కోర్సులో భాగంగా సమర్పించిన సిద్ధాంత గ్రంథం గురించి వివరాలను జైన్‌ సమాచార దరఖాస్తులో కోరారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం సీపీఐఓ ఈ దరఖాస్తును అన్యా యంగా తిరస్కరించారు. జైన్‌ పదిరూపాయల పోస్టల్‌ ఆర్డర్‌ ఇచ్చినా దాన్ని రిజిస్ట్రార్‌ పేరుతో కాకుండా సీపీఐఓ పేరుతో ఇచ్చాడనే కుంటిసాకుతో సమాచారం ఇవ్వలేదు. పేరు మార్చమని కోరితే సరిపోయేది. కాని పేరు సరిగా లేదని మొత్తం దరఖాస్తునే తిరస్కరించడం ఆర్టీఐ చట్ట వ్యతిరేకమైన పని. మేం తిరస్కరించలేదని కేవలం వెనక్కి పంపామని సీపీఐఓ జయ్‌చంద్‌ వాదించారు. పోస్టల్‌ ఆర్డర్‌తోపాటు దరఖాస్తును కూడా వెనక్కి పంపడం వల్ల సమాచారం పొందే మార్గమేదీ మిగల్లేదని కనుక వెనక్కి పంపడం తిరస్కారమే అవుతుందని జైన్‌ వాదించారు.



పోస్టల్‌ ఆర్డర్‌ తీసుకున్న  క్షణమే పదిరూపాయల సమాచార ఫీజును భారత ప్రభుత్వానికి చెల్లించినట్టే. ఆ పది రూపాయలు తమ ఖాతాలోకి మార్చుకోవడం కోసం యూనివర్సిటీ వారు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం రిజిస్ట్రార్‌ పేరుతోనే ఎందుకు అకౌంట్‌ ఉండాలి? సీపీఐఓ పేరుతో మరొక ఖాతా తెరిచి ఆ పేరుతో వచ్చే పోస్టల్‌ ఆర్డర్‌లను ఎందుకు తీసుకోకూడదు? సమాచార హక్కు కోరుకునే వారు చట్టం నిర్దేశించిన సిపిఐఓ పేరునే వాడతారు. దానికి వీలు కల్పించాల్సిన బాధ్యత అధికారు లదే. ఈ మార్పులు చేసుకోవాలని కమిషన్‌ ఎన్ని సార్లు సూచించినా వినకుండా ఢిల్లీ యూనివర్సిటీ దరఖాస్తులను తిరస్కరిస్తూనే ఉంది. సమాచారాన్ని ఇవ్వకుండా ఉండేం దుకు ఈ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టమవుతున్నది.



పది రూపాయల పోస్టర్‌ ఆర్డర్‌ సరిగా లేకపోతే సమా చారం ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లను కూడా రంగంలోకి దింపింది ఢిల్లీ విశ్వ విద్యాలయం. దాదాపు రెండేళ్ల పాటు సమాచార కమిషన్‌ ముందు రెండో అప్పీలును ఒక లిటిగేషన్‌ రూపంలో నడప డానికి నానా ప్రయత్నాలు చేసింది. రకరకాల సాగదీత దర ఖాస్తులు, పిటిషన్లు తయారు చేసి వాదనలు చేయడానికి సమయం కావాలని కోరింది,  పనికిరాని సాకులతో ఏడాది పైగా వాయిదాలు కోరింది. లేదంటే తమకు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని గగ్గోలు చేయడానికి సీనియర్‌ లాయ ర్లకు వేల రూపాయలు సమర్పించింది. ఒక చిన్న సమా చారం ఇవ్వడానికి ఇష్టం లేక ఇంత ప్రజాధనం వ్యయం చేసి ఆలస్యంచేసి కమిషన్‌ సమయాన్ని వృథా చేసే దుర్మా ర్గానికి ఒక విశ్వవిద్యాలయం పాల్పడడం విచారకరం.



విశ్వవిద్యాలయం అంతర్గతంగా రూపొందించిన విధాన ప్రక్రియ ప్రకారమే తాను పోస్టల్‌ ఆర్డర్‌ను తిరస్క రించానని మరో వాదాన్ని లేవదీశారు జయ్‌చంద్‌. స్వీక రించడానికి వీల్లేని ఆర్థిక పత్రాలు అనే ఒక సాకును వీరు సృష్టించారు. ఈ అంతర్గత విధానాన్ని ఎవరు రూపొందిం చారో చెప్పలేదు. దానికి ఎవరి అనుమతి ఉందో వివరిం చలేదు. దానికి ఆధారం ఏమిటో తెలియదు. దీనికి రిజి స్ట్రార్‌ మరికొందరు అధికారులు లా లెక్చరర్లు మద్దతు పల కడంతో ప్రజాసమాచార అధికారులు సమాచార వ్యతిరేక అధికారులుగా మారారు. అకడమిక్‌ కౌన్సిల్‌ గాని ఎగ్జి  క్యూటివ్‌ కౌన్సిల్‌ కాని ఆమోదించని విధానాన్ని ఒక అధి కారి అంతర్గత అధికారిగా ఏవిధంగా అమలు చేస్తారు? పార్లమెంటు రూపొందించిన చట్టానికి వ్యతిరేకంగా ఒక అంతర్గత విధానాన్ని తయారు చేస్తే ఎలా చెల్లుతుంది అని పరీక్షించలేదు.



విశ్వవిద్యాలయంలో ఉన్నలా విభాగాన్ని, ప్రొఫెసర్లను సంప్రదించకుండా ఈ చట్ట వ్యతిరేక విధా నాన్ని రూపొందించడం హక్కుల మూకుమ్మడి ఉల్లంఘన కాదా? అదీగాక ప్రభుత్వ సంస్థలలో సమాచార చట్టానికి వ్యతిరేకంగా రూపొందించిన ఏ విధానం కూడా చెల్లదని, ఇదివరకే ఆ విధానాలు ఉన్నా కొత్తగా రూపొందించినా, చట్టానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లకుండా సమాచార  హక్కు చట్టం మాత్రమే వర్తిస్తుందని చాలా స్పష్టంగా సెక్షన్‌ 22 చెబుతున్నదని కమిషనర్‌ గుర్తుచేయవలసి వచ్చింది. విచారకరమైన విషయం ఏమంటే ఈ సమాచార వ్యతిరేక వ్యవహారాలకు ఒక లా టీచర్‌ కూడా అండగా ఉండడం.



న్యాయశాస్త్ర విభాగం ఇందులో చట్టవ్యతిరేక పాత్ర పోషించడం మరీ విచారకరం. సమాచారహక్కు చట్టం ఎక్కడా నిర్దేశించనిరీతిలో ఒక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ అంత ర్గత ప్రక్రియను రూపొందించినా చెల్లదని కమిషన్‌ ప్రకటిం చింది. చట్టంలో ఉన్న అంశాలను దానికింద చేసిన నియ మాలను పేర్కొంటూ విశ్వవిద్యాలయ విధానాలు ఎంతగా చట్ట వ్యతిరేకమో వివరించింది.  కేవలం సెక్షన్‌ 8 లేదా 9 కింద పేర్కొన్న మినహాయింపు నియమాల కింద మాత్రమే సమాచార అభ్యర్థనను తిరస్కరించవలసి ఉంటుంది. మరో కారణంపైన తిరస్కరిస్తే అది చట్ట వ్యతిరేకమే. అయినా భారత ప్రభుత్వానికి పది రూపా యలు చెల్లించిన తరువాత దరఖాస్తును తిరస్కరించే అధికారం పీఐఓకు లేదు. పది రూపాయల కోసం లక్షల రూపాయలు వెచ్చించి మామూలు లిటిగెంట్‌ వలె ఒక యూనివర్సిటీ కోర్టులకెక్కి కక్షిదారు కావడం ప్రజాధనాన్ని దుర్విని యోగం చేయడమే అవుతుందని సీపీఐఓ పైన 25 వేల రూపాయల జరిమానా విధించింది.



(వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్‌, కేంద్ర సమాచార కమిషనర్‌ )



 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top