సామాజిక న్యాయమే బీఎన్‌ ధ్యేయం

సామాజిక న్యాయమే బీఎన్‌ ధ్యేయం


సందర్భం

పిడివాదాన్నీ, యథాతథవాద పంథానీ మార్చడం అంత సులభం కాదు. వామపక్ష శిబిరాలలో అయితే ఇది మరింత కష్టం. మార్పుకీ, పురోగతికీ చిరునామాగా చెప్పుకున్న ఆ పార్టీలు కూడా సామాజిక న్యాయం విషయంలో చతికిలబడిన సంగతి దాచేస్తే దాగని నిజం. దీనిని ఆలస్యంగా అయినా గుర్తించి ఇటీవల సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ‘లాల్‌–నీల్‌’నినాదం ఇచ్చారు. కానీ సామాజిక న్యాయం కోసం పార్టీ మీద పోరాడిన వారు గతంలోనే ఉన్నారు. అందుకోసం పార్టీని వీడిన వారు వామపక్ష శిబిరాలలో ఉన్నారు. పోరాటం, సంస్కరణ, సామాజిక న్యాయ దృష్టి సమంగా ఉన్న భీంరెడ్డి నరసింహారెడ్డి (మార్చి 15, 1922–మే 9, 2008) ఇందుకు సాక్షిగా నిలబడతారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో ఆయనది విశిష్ట స్థానం. పోలీసు చర్య తరువాత సాగిన పార్లమెంటరీ రాజకీయాలలో ఆయన నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకం.



తెలంగాణ సాయుధ పోరాటం మలిచిన యోధుడు భీంరెడ్డి నరసింహారెడ్డి. బీఎన్‌రెడ్డిగా చరిత్ర ప్రసిద్ధుడైన నరసింహారెడ్డి జీవితం, పోరాటం కొన్ని తరాలకు పాఠం. దొరతనానికి ఆలవాలమైన గడీలలో పుట్టారాయన. కానీ నిజాం పాలనలో మగ్గిపోతున్న పీడిత, తాడిత జనం విముక్తి కోసం తుపాకీ పట్టారు. దున్నేవానికే భూమి నినాదంతో గ్రామాలలో భూపంపిణీ చేపట్టిన విశాల హృదయుడు. భూస్వాముల మిగులు భూములను పేదలకు పంచిపెట్టే బృహత్తర కార్యక్రమాన్ని చరిత్రలో తొలిసారి చేపట్టిన విప్లవకారునిగా కూడా బీఎన్‌ సుప్రసిద్ధులు. బీఎన్‌ కుటుంబంలోనే ఒక సామాజిక దృక్పథం, స్పృహ కనిపిస్తాయి. వారిది సంపన్న రైతు కుటుంబం. అయినా చిన్నారి బీఎన్‌ను కుటుంబంలోని పెద్దలు కష్టజీవులతో కలసిమెలసి ఉండే విధంగా పెంచారు. బీఎన్‌ బాల్యమంతా వ్యవసాయ క్షేత్రంలోనే గడిచింది. ప్రాథమిక విద్య స్వగ్రామం కర్విరాల కొత్తగూడెం (ఉమ్మడి నల్లగొండ జిల్లా) లోనే ఆరంభమైంది.



దృక్పథాన్ని ఇచ్చిన కాలం

నిజాం పాలన పట్ల నిరసన పదునెక్కుతున్న కాలంలో బీఎన్‌ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. నిజాం సంస్కృతిని బద్దలుకొట్టి, సామాజిక విప్లవం ద్వారా మొత్తం వ్యవస్థను మార్చాలని, బానిసత్వం నుంచి విముక్తం కావాలని నినదిస్తూ ఆంధ్రమహాసభ ఆవిర్భవించింది. నిజాం వ్యతిరేక శక్తులను ఏకం చేసిన అతి పెద్ద వేదిక ఆంధ్రమహాసభ. ఆ సంస్థ నాయకులు ఇచ్చిన ఉపన్యాసాలు బీఎన్‌ను ఉత్తేజితుడిని చేసేవి. మరొక వంక నిజాం వ్యతిరేక పోరాటంలో కీలకంగా ఉన్న ఆర్య సమాజ్‌ కార్యకలాపాలకు కూడా ఆయన హాజరయ్యేవారు. ఇలాంటి వాతావరణంలోనే ఆయన తొమ్మిదో తరగతి పూర్తి చేశారు. కానీ అప్పుడే తండ్రి (రామిరెడ్డి, తల్లి చొక్కమ్మ) మరణించడంతో ఇంటి బాధ్యత, సాగు బాధ్యత బీఎన్‌ భుజాల మీద పడింది. ఉద్యమం, సేద్యం మనసు మీద బలంగా ముద్ర వేసినా, చదువు మీద ఆయనకు మమకారం పోలేదు. పదో తరగతి చదవడానికి హైదరాబాద్‌ వచ్చారు. రెడ్డి హాస్టల్‌లో ప్రవేశం కోసం అప్పుడే కొత్వాల్‌ వెంకటరామారెడ్డిని కూడా కలుసుకున్నారు. ఫలితం లేకపోయింది. అయినా పదో తరగతి చదువు పూర్తి చేసి మళ్లీ స్వగ్రామం చేరుకున్నారు.



అప్పుడే తన పొలంలో జరిగిన ఒక సంఘటన ఆయనను పేదరికం గురించి ఆలోచించేటట్టు చేసింది. ఆయన భవిష్యత్‌ ప్రణాళికను అప్పుడే సిద్ధం చేస్తున్నట్టు గోరంట్ల నుంచి దేవులపల్లి వెంకటేశ్వరరావు రహస్యంగా పంపిన ‘అక్టోబర్‌ విప్లవం సంచిక’అందింది. ఆయన చదివిన మొదటి కమ్యూనిస్టు పాఠం అందులోదే. ఆ సిద్ధాంతంతో పేదరికం పోతుందని, దోపిడీని నివారించవచ్చునని, అందరికీ తిండి, పని ఉంటాయని చెబుతూ చేసిన విశ్లేషణ బీఎన్‌ను కదిలించింది. దీనికి తోడు ‘పల్లెటూరి పేదలకు...’ అనే పుస్తకం, లెనిన్‌ రాసినది– మరో కోణం నుంచి ప్రభావితం చేసింది. అప్పుడే వరంగల్‌లో జరిగిన (1942–43) ఆంధ్రమహాసభ బీఎన్‌ లోని ఆవేశాన్ని ఆచరణ వైపు నడిపించింది. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన మొట్టమొదటిసారి ‘కోసుకు వీసం’ పోరాటం చేశారు. కోసు దూరం బరువు మోసేవాళ్లకు ఆ రోజుల్లో అణా ఇవ్వాలనే నిబంధన ఉండేది. కానీ దాన్ని చాలామంది పాటించేవాళ్లు కాదు. తమ ఊరు నుంచే కోసుకు వీసం పోరాటాన్ని బీఎన్‌ ఆరంభించారు. పదకొండవ ఆంధ్రమహాసభ నాటి నుంచి పోరాటాలు ప్రజలను కదిలిం చాయి. అప్పటి వరకు విన్నపాలకు, వినతులకు పరిమితమైన ఆందోళనలను తీవ్రం చేసి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి కమ్యూనిస్టు యోధులు ప్రజల్లోకి తీసుకెళ్లారు.



ఐలమ్మ... వెనుక బీఎన్‌

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో బడుగు వర్గాల పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచే ఘట్టం చాకలి ఐలమ్మ తిరుగుబాటు. సాయుధ పోరాట యోధుడు బీఎన్‌ ఆ తిరుగుబాటులో కీలకంగా నిలిచి ఐలమ్మ పేరు, పోరు ప్రపంచానికి వెల్లడయ్యేందుకు దోహదం చేశారంటే అతిశయోక్తి కాదు. అట్టడుగు వర్గాల ప్రజానీకం నిజాం పాలనలో ఎలాంటి దురవస్థను అనుభవించేవారో చెప్పడానికి ఐలమ్మ జీవితం కొండగుర్తు. ఆమె సాయుధ సమరంలో పాల్గొనలేదు. కానీ గొప్ప పోరాట యోధురాలిగా చరిత్రకెక్కింది. ఆ గొప్పతనం వెనుక బీఎన్‌ ఉన్నారు. ఆమె భర్తను దొంగగా చిత్రించి, అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినప్పుడు తన పంటను కాపాడుకోవడం కోసం అనివార్యంగా పోరాటంలోకి వచ్చారు. కష్టపడి పండించుకున్న తిండిగింజలను దొరల గూండాలు తన్నుకుపోయేందుకు సిద్ధమయ్యారు. కల్లంలో ఉన్న వరికుప్పను కాపాడుకోవడం కోసం ఆమె గట్టిగా నిలబడింది. సరిగ్గా ఆ సమయంలో ఐలమ్మ పోరాటానికి మద్దతుగా నిలిచి గూండాలను తరిమికొట్టారు, బీఎన్‌. సహజంగానే బలాఢ్యుడాయన. ఐలమ్మ సాహసానికి తోడు, బీఎన్‌ను ఎదిరించే ధైర్యం లేక గూండాలు పారిపోయారు.



అప్పుడైనా, ఇప్పుడైనా చితికిన రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేసేవాళ్లే గొప్ప వ్యక్తులవుతారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రైతును ఆదుకొనేవాళ్లు లేరు. అప్పుడు భూస్వాముల దాడుల నుంచి రైతును కాపాడే ఉద్యమాలు వచ్చినట్లే ఇప్పుడు గిట్టుబాటు కానీ ధరల మార్కెట్‌ దాడుల నుంచి రైతులను ఆదుకొనే పోరాటాలు చేపట్టవలసి ఉంది. మార్కెట్‌ మాయాజాలంలో పడి రైతులు పెద్ద ఎత్తున వేరుశెనగ పండించారు.అది ఎంతో కాలం నిలవలేదు. ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. రైతు దారుణంగా నష్టపోయాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే. మార్కెట్‌ మాయాజాలం మిర్చిని ముందుకు తెచ్చింది. అదే పరిస్థితి పునరావృతమవుతూ నాడు ఆవులను మలిపిన అర్జునుడిలా బీఎన్‌రెడ్డి రైతుల కోసం నిలబడి గూండాల దాడులను తిప్పికొట్టాడు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు తెచ్చి రైతులను ఆదుకొన్నవాడే అర్జునుడవుతాడు.



లాల్‌నీల్‌ నినాదం ఆనాటిదే....

పోలీసు చర్య తరువాత బీఎన్‌ నాగారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో మరోసారి ఎన్నికయ్యారు. మిర్యాలగూడ నుంచి 1971,1984, 1991లలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. నిజానికి సీపీఎం ఇప్పుడు చెబుతున్న లాల్‌ నీల్‌ నినాదాన్ని ఆంధ్రమహాసభ ఆనాడు భువనగిరి సభలోనే ఎత్తుకుంది. లాల్‌ అంటే పోరాటం, నీల్‌ అంటే ఉత్పత్తిదారుడు. పంట పండించే రైతు. ఇప్పుడు వామపక్ష, ప్రజాస్వామిక శక్తులు; దళితులు ఏకం కావడం గురించి లాల్‌ నీల్‌ నినాదం ఇచ్చారు.



ఇక్కడే ఒక విషయం గుర్తు చేసుకోవాలి. బీఎన్‌ మహోన్నత వ్యక్తిత్వాన్నీ, సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న నిబద్ధతనీ తిరుగులేకుండా అది రుజువు చేస్తుంది. పార్టీ పరిధికి మించి కాలాతీతంగా ఆలోచించగలిగిన ఆయన దృష్టిని వెల్లడిస్తుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ సీపీఎంకు బలమైన కేంద్రం. 1995 శాసనసభ ఎన్నికల సందర్భంగా సరిగ్గా ఆ జిల్లా పార్టీలోనే చీలిక వచ్చింది. ఆ చీలికకు సామాజిక న్యాయం కేంద్ర బిందువు. తుంగతుర్తి నియోజక వర్గం నుంచి మల్లు స్వరాజ్యం (రెడ్డి)ను నిలపాలని పార్టీ నాయకత్వం అభిప్రాయపడింది. అయితే ఆ స్థానాన్ని వర్ధెల్లి బుచ్చిరాములుకు (గౌడ్‌)కు కేటాయించాలని బీఎన్‌ చెప్పారు. ఆ స్థానాన్ని ఎప్పుడూ బీఎన్, స్వరాజ్యం, వీఎన్, కుశలవరెడ్డిల కేనా అని అధిష్ఠానాన్ని నిలదీసినవారు బీఎన్‌. పార్టీ నాయకత్వం ఆ స్థానం బుచ్చిరాములుకు కేటాయిచింది. కానీ బుచ్చిరాములు ఓడిపోయారు.



ఇందుకు స్వరాజ్యం, మల్లు వెంకటనరసింహారెడ్డిలే కారణమంటూ సామాజిక న్యాయ బృందంగా ఉన్న దళత వర్గం సీపీఎం నుంచి చీలిపోయింది. సామాజిక న్యాయం పేరిట 1996లో సీపీఎం–బీఎన్‌గా చీలిక వర్గం కొత్త శిబిరం ఏర్పాటు చేసింది. ఇంత నిబద్ధతను అప్పుడే ఆయనలో జనం చూశారు. 1997లో బీఎన్‌ అన్ని కులాలను, వర్గాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి రెండు లక్షల మందితో సభ నిర్వహించారు. మాదిగ దండోరా, మాల మహానాడు, బీసీ సంఘం, తుడుం దెబ్బ, గిరిజన సంఘం, దళిత, గిరిజన బీసీ, మైనారిటీ వర్గాలను ఆయన ఆ వేదిక మీదకు తెచ్చారు. అయితే 2000 సంవత్సరంలోనే సీపీఎం–బీఎన్‌ వర్గాన్ని ఓంకార్‌ స్థాపించిన ఎంసీపీఐలో విలీనం చేశారు.



బీబీనగర్‌ నుంచి రామన్నపేట, చిట్యాల, నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా నడికుడి వరకు రైలు మార్గాన్ని సాధించిన ఘనత బీఎన్‌దే. అలాగే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ రెండోదశ కాలువ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయించిన ఘనత కూడా ఆయన సొంతం. ఈ సందర్భంలో బీఎన్‌ జీవిత భాగస్వామి సరోజిని గురించి చెప్పకపోతే ఒక లోటే. చిన్ననాడే భర్తను కోల్పోయారు సరోజిని. రావి నారాయణరెడ్డి సలహా మేరకు బీఎన్‌ ఆమెను వివాహం చేసుకున్నారు. రాజకీయాలు, ఉద్యమాల పట్ల పెద్దగా అవగాహన లేని ఆమె చివరకు నెలల పసికందును చంకను ఉంచుకుని తుపాకీ పట్టారు. అడవులలో ఒక బిడ్డను పొగొట్టుకుని కూడా పోరాటబాటను వీడని ధీరవనిత. బీఎన్‌ సంస్కర్త. విప్లవకారుడు. తుది ఊపిరి వరకు సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడు.

(మే 9వ తేదీ బీఎన్‌ వర్ధంతి)



వ్యాసకర్త: చుక్కా రామయ్య

ప్రముఖ విద్యావేత్త

శాసనమండలి మాజీ సభ్యులు

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top