కాలుష్యంపై కొరడా!
పర్యావరణవేత్తలు మొరపెట్టుకున్నా... మెత్తగా బతిమాలుకున్నా వినని వాహన ఉత్పత్తిదారులకు ఇప్పుడు పీకలమీదికొచ్చింది. వాతావరణంలోకి అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నవని ముద్రపడిన బీఎస్ 3 (భారత్ స్టేజ్ 3) ప్రమాణాలున్న వాహనాల అమ్మకాలను, వాటి రిజిస్ట్రేషన్లను శనివారం నుంచి దేశంలో నిలిపేయా లని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలిచ్చింది. ఈ వాహనాల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు చిన్న తరహా, భారీ కమర్షియల్ వాహనాలు, కార్లు తది తరాలున్నాయి.
ప్రస్తుతం షోరూంలలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇలాంటి వాహ నాల సంఖ్య 8,24,000 అని వాహన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాల వాటా 6,71,000 పైమాటే! వాతావరణ కాలుష్యాన్ని మరింత తగ్గించే సాంకేతికతలను అమల్లోకి తెస్తూ ఏడేళ్లక్రితం బీఎస్ 4 ప్రమాణాలు నిర్ణ యించారు. ఆ ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను ఉత్పత్తి చేయడం కూడా మొదలైంది. అలాంటపుడు బీఎస్ 3 ప్రమాణాలున్న వాహనాల ఉత్పత్తిని క్రమేపీ తగ్గిస్తూ చివరకు దాన్ని ఆపేయాలి.
2015లో కేంద్రం వెలువరించిన వాహన ఇంధన విధానంలో సైతం 2017 ఏప్రిల్ 1 కల్లా బీఎస్ 4 ప్రమాణాలను అనుసరిం చాలని నిర్దేశించారు. అప్పుడైనా వాహన ఉత్పత్తిదార్లు మేల్కొనలేదు. ఈ విధానంలో ఉన్న అస్పష్టతను వారు సాకుగా తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి వాహనాల ఉత్పత్తిని ఆపాలా, అసలు అమ్మకాలనే ఆపాలా అన్న విషయంలో అది నిర్దిష్టంగా చెప్పలేదు. అమ్మకాలనే ఆపేయాలని స్పష్టంగా చెబితే తాము అంతకు చాన్నాళ్ల ముందే వాటి ఉత్పత్తి జోలికి వెళ్లేవాళ్లం కాదని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కేవలం వాహన ఉత్పత్తిదార్లను తప్పుబట్టి ప్రయోజనం లేదు. బీఎస్ 4 వాహనాల్లో వినియోగించడానికి వీలైన పెట్రోల్, డీజిల్ తగినంతగా అందు బాటులో ఉంచడంలో చమురు సంస్థలు కూడా విఫలమయ్యాయి. చమురు శుద్ధికి నూతన సాంకేతికతలను వినియోగించడంలో అవి తాత్సారం చేస్తున్నాయి. కొత్త సాంకేతికతకు దాదాపు రూ. 80,000 కోట్లు ఖర్చవుతుందంటున్నారు.
బీఎస్ 3 వాహనాల వల్ల కలుగుతున్న ముప్పు అంతా ఇంతా కాదు. ఆ వాహనాల్లో కిలో ఇంధనానికి 2.30 గ్రాముల కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలో విడుదలవుతుంది. అదే బీఎస్ 4 వాహనాలైతే కిలోకు ఒక గ్రాము కార్బన్ మోనా క్సైడ్ మాత్రమే వాతావరణంలో కలుస్తుంది. వాయు కాలుష్యంలో ప్రధాన పాత్ర కార్బన్ మోనాక్సైడ్దేనని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. కొత్త సాంకేతికతకు అనుగుణంగా వాహనాలను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్ట కుండా పాత ప్రమాణాలనే కొనసాగించడంవల్ల సమస్య రోజురోజుకూ ఎక్కువవు తున్నదని వారు ఆరోపిస్తున్నారు. బీఎస్ 3 వాహనాల ఉత్పత్తిని నిలిపేందుకు అవ సరమైన చర్యలను తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. వాహన ఇంధన విధానాన్ని విడుదల చేయడమే తప్ప దానికి అనుగుణమైన చర్యలుంటున్నాయా లేదా అని ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. నిజానికి యూరప్ దేశాలు ఇప్పటికే యూరో 6 ప్రమాణాలను అమల్లోకి తెచ్చాయి.
రెండేళ్ల నాటి ఇంధన విధానం బీఎస్ 5ను 2020నాటికి, బీఎస్ 6ను 2024 నాటికి పాటించేలా చూడాలని నిర్ణయించారు. కానీ బీఎస్ 3 ప్రమాణాల తోనే ఇప్పటికీ వాహనాల ఉత్పత్తి అవుతుంటే కొత్త ప్రమాణాలను అమల్లోకి తెచ్చుకుని ప్రయోజనం ఏముంది? ద్విచక్ర వాహనమైనా, మరొకటైనా ఒకసారి రోడ్లపైకొస్తే అది కనీసం 20 ఏళ్లపాటు నడుస్తుంది. ఈలోగా అది విడిచిపెట్టే కాలుష్యం జనం ప్రాణాలు తోడేస్తుంది. ఆ వాహనాల పొగలో ఉండే నైట్రోజన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటివి కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధులకు మాత్రమే కాదు... భూతాపం పెంచి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతాయి. చూడటానికి బీఎస్ 3 వాహనమైనా, బీఎస్ 4 వాహనమైనా ఒకేలా ఉంటుంది. కానీ ఎలక్ట్రానిక్స్, సెన్సర్ వ్యవస్థల్లో... ఇంజన్ కుండే సామర్ధ్యంలో ఎంతో తేడా ఉంటుంది.
మన దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ శక్తిమంతమైనది. దేశ ఆర్ధిక వ్యవస్థలో దాని పాత్ర అత్యంత కీలకం. నాలుగున్నర లక్షల కోట్ల టర్నోవర్ కలిగి, ప్రత్య క్షంగా పరోక్షంగా 2.5 కోట్లమందికి ఉద్యోగాలు కల్పిస్తున్న ఆ పరిశ్రమ జోలికి పోవాలంటే ప్రభుత్వాలు సందేహిస్తాయి. వాటికి సంబంధించి తీసుకునే ఏ నిర్ణ యమైనా వేల కోట్ల నష్టానికి, వేలాదిమంది కష్టానికి దారితీయొచ్చునని సందే హిస్తాయి. ఉత్పత్తిదారులకూ ఈ సంగతి తెలుసు. అందుకే తమకేమీ జరగదన్న భరోసాతో ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల హీరో మోటార్ కార్పొరేషన్, టీవీఎస్, హోండా లాంటి ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థలు, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, టాటా మోటార్స్, ఫోర్స్ మోటార్స్, అశోక్ లేలాండ్, అతుల్ ఆటో వంటి సంస్థల వాహనాలు అనిశ్చితిలో పడతాయి.
ఈ జనవరి–మార్చి మధ్య జరిగిన ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకున్నా బీఎస్ 3 ప్రమాణాలున్న వివిధ రకాల వాహనాలు భారీగా మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు లక్షల్లో ఉంటే కమర్షియల్ వాహనాలు, కార్లు వేలల్లో ఉన్నాయి. వీటి డిజైన్లను బీఎస్ 4 ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం దాదాపు అసాధ్యం. కనుక ఈ వాహనాలను వేరే దేశాలకు తరలించి విక్రయించడం మినహా ఉత్పత్తి దారులకు మరో మార్గం లేదు. పైగా బీఎస్ 3 వాహనాల అమ్మకం ఆగిపోయే అవకాశం ఉంటుందని తెలిసినా వాటిని ఉత్పత్తి చేసి, తమకు పంపారని... అందువల్ల నష్టపోయాం గనుక పరిహారం చెల్లించాలని విక్రయ సంస్థలు పరిశ్రమలపై ఎదురుదాడికి దిగే ప్రమాదం ఉంటుంది.
అటు చెల్లుబాటు కాని వాహనాలు, ఇటు విక్రయదార్ల డిమాండ్లతో వాహన పరిశ్రమకు ఊపిరాడని స్థితి. దీన్నంతటినీ గమనించి సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునస్స మీక్షించుకుంటే వేరే విషయం. ఏదేమైనా వాహన ఉత్పత్తిదారుల ప్రయోజనాల కంటే తమకు ప్రజల ఆరోగ్యమే ప్రధానమని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కీలక మైనవి.