మల్చింగ్‌తో మేలెంతో..


బీర్కూర్ :  వ్యవసాయంలో మెలకువలు తెలుసుకుంటూ, వాటిని క్షేత్రంలో అమలు చేస్తూ పురోగమిస్తున్నారు పలువురు రైతులు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అధిక దిగుబడులూ సాధిస్తున్నారు. బిందు సేద్యం, మల్చింగ్ విధానంలో పంటలు పండిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకుంటున్నారు రైతునగర్‌కు చెందిన మద్దుకూరి గౌతమ్ కుమార్ అనే రైతు.



ఆయన సాగు పద్ధతుల గురించి తెలుసుకుందామా మరి..

 ‘‘పదేళ్ల క్రితం బిందు సేద్యం గురించి తెలుసుకున్నాను. అప్పట్లో ప్రభుత్వం 60 శాతం రాయితీపై పరికరాలను సరఫరా చేసింది. మూడెకరాల్లో పరికరాల ఏర్పాటుకు సుమారు రూ. 50 వేల వరకు ఖర్చయ్యాయి. గతేడాది రెండెకరాల్లో బిందు సేద్యం పరికరాలను(90 శాతం రాయితీ) ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కువగా క్యాబేజీ, కాలీఫ్లవర్, మిర్చి, టమాట, మొక్కజొన్న సాగు చేస్తున్నాను. బోధన్, వర్ని, బాన్సువాడ అంగడులలో విక్రయిస్తున్నాను.



 ఇటీవలి కాలంలో మల్చింగ్ విధానం గురించి తెలిసింది. ఆ పద్ధతిని కూడా అవలంబిస్తున్నాను. ఈసారి మూడెకరాల్లో టమాట, రెండెకరాల్లో మొక్కజొన్న వేశాను.



 బిందు సేద్యం, మల్చింగ్ విధానంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. ఈ విధానాలు అవలంబిస్తూ ఎకరానికి సరిపోయే నీటితోనే ఐదెకరాల్లో పంటలు సాగు చేస్తున్నాను’’ అని గౌతమ్ కుమార్ వివరించారు. ఈ విధానాల్లో పంటల సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గాయని, రాబడి కూడా పెరిగిందని తెలిపారు.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top