'ఆ భావన ప్రజల్లో ఉంది'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారని ఆ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ అక్టోబర్ 7వ తేదీన గుంటూరులోని నల్లపాడులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారని వారు వెల్లడించారు. సోమవారం విజయవాడలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనకు చంద్రబాబే మూల కారకుడని వారు ఆరోపించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతో ఉందన్నారు. ప్రత్యేక హోదా అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మూడు సార్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రమంత్రి వెంకయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా అడ్డుకుంటున్నారన్న భావన ప్రజల్లో ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే.