ఉద్యమ కార్యాచరణపై నేతల భేటీ
ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు గుంటూరులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యమ కార్యాచరణతో పాటు.. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా చర్చించారు. సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్థసారథి, అంబటి రాంబాబు, కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు. గుంటూరులో అందుబాటులో ఉన్న ప్రధాన నాయకులందరినీ ఈ సమావేశానికి పిలిచారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేయాలని పార్టీ నిర్ణయించుకుంది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు, ఒత్తిడి పెంచేందుకు వీలుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈనెల 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజధాని శంకుస్థాపనకు వస్తున్న సందర్భంగా అప్పుడే ప్రకటన చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఏయే రూపాల్లో ఉద్యమం ఉండాలో చర్చిస్తున్నారు. మరికొద్ది సేపట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఒకటి రెండు రోజుల తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కూడా చర్చించి ఉద్యమ తీరుతెన్నులను నిర్ణయిస్తారు. ఇప్పటికే ఉద్యమం తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఏయే రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలో నిర్ణయం తీసుకుంటారు.