వైఎస్ జగన్ ఆరోగ్యం విషమం: 3+కు చేరుకున్న కీటోన్స్ స్థాయి

వైఎస్ జగన్ ఆరోగ్యం విషమం: 3+కు చేరుకున్న కీటోన్స్ స్థాయి - Sakshi


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. కీటోన్స్ 3+ స్థాయికి చేరుకున్నాయి.  కుమారుడి ఆరోగ్యం మరింత క్షీణించటంతో వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమవారం సాయంత్రం గుంటూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా దీక్షాస్థలి వద్దే ఉన్నారు. ఇక వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా బెంగళూరు నుంచి గుంటూరు బయల్దేరారు.


 


కాగా వైఎస్ జగన్ కు సోమవారం ఉదయం రెండుసార్లుగా నిర్వహించిన వైద్య పరీక్షలలో కీటోన్స్ 3+ స్థాయికి చేరిందని, కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేనే ప్రమాదకరం అని, ఇక 3+ అంటే మరింత విషమం అని వైద్యులు తెలిపారు. శరీరంలో మొత్తం అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని అన్నారు. ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, గుండె, కిడ్నీలు, మెదడు మీద ప్రభావం పడుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ అనేవి అసలు శరీరంలో ఉండకూడదని, కానీ ప్రస్తుతం అవి వైఎస్ జగన్ శరీరంలో 3+ స్థాయిలో ఉన్నాయని చెప్పారు.


 


గంటగంటకూ ఆయన ఆరోగ్యం విషమిస్తోందని, దీక్ష విరమించడమే మంచిదని సూచించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దీక్ష విరమించాలని వైఎస్ జగన్ను కోరారు. అయితే ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రత్యేక హోదా గురించిన ప్రకటన వస్తే తప్ప దీక్ష విరమించేది లేదంటున్నారు.



వైద్య పరీక్షల వివరాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ రమేశ్ ఉదయం తెలిపారు. ఆయన పల్స్ రేటు 68, బీపీ 130/80, బరువు 72.9, బ్లడ్ షుగర్ 84, కీటోన్స్ 3+ అని డాక్టర్ రమేష్ వివరించారు. ఆదివారం మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ కీటోన్ బాడీస్ పరీక్ష చేయలేదని చెప్పారు.  సోమవారం మధ్యాహ్నం జీజీహెచ్ వైద్యులు మరోసారి  మీడియా సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దీక్ష విరమిస్తే మంచిదని వైద్యులు తెలిపారు. అయితే ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు.



కాగా ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ - 61; బ్లడ్ యూరియా - 26; సీరమ్ క్రియాటిన్ -1; టోటల్ బైలురూబిన్ - .6, ఎస్జీఓటీ- 44; ఎస్జీపీటీ - 20; ఆల్కలైన్ - 75; సోడియం - 150; పొటాషియం - 5.1; క్లోరైడ్స్ - 106; బైకార్బనేట్స్ - 13 చొప్పున ఉన్నాయి. అంతకుముందు తీసుకున్న ర్యాండమ్ బ్లడ్ సుగర్ విలువలు సరిగా రావని, అందుకే ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ పరీక్ష చేశామని డాక్టర్ రమేశ్ వివరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top