'చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారు'

'చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారు' - Sakshi


ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలు ఏకతాటి మీద నిలబడి  బంద్ చేస్తే.. చంద్రబాబు నాయుడు మాత్రం ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని మరీ బంద్ను విఫలం చేసేందుకు ప్రయత్నాలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం నాడు రాష్ట్ర బంద్ ముగిసిన అనంతరం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...


  • సీఎం చంద్రబాబే ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని బంద్ను విఫలం చేసేందుకు విజయవాడకు వెళ్లి అక్కడే కేబినెట్ మీటింగ్ పెట్టి, జిల్లాల వారీగా మానిటర్ చేసి, రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్లుగా సెక్షన్ 144 అమలుచేశారు.

  • వేల సంఖ్యలో పోలీసులను మోహరించి, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. వేలసంఖ్యలో కార్యకర్తలనుఅరెస్టు చేశారు.

  • విద్యార్థులను కొట్టి, ఈడ్చుకుంటూ పోయారు. మహిళలని కూడా చూడకుండా వారిని సైతం వాళ్లను ఎత్తి వ్యాన్లలోకి విసిరేశారు.

  • ఈదృశ్యాలన్నీ టీవీలలో కనిపించాయి. అసలు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాకు అనుకూలమా, వ్యతిరేకమా అనిపిస్తోంది.

  • కనీసం కేబినెట్ సమావేశంలోనైనా ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రానికి తీర్మానం చేశారా అంటే, ఆ ప్రస్తావనే లేదు.

  • తన కేంద్ర మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్లు లేఖ రాస్తారేమోనని చూశాం. ఆ ప్రస్తావనే లేదు.

  • ఆయన తీరు చూస్తే అసలు తాను ప్రత్యేక హోదాకు వ్యతిరేకమని రాష్ట్ర ప్రజలంతా తెలుసుకునేలా చేశారు.

  • రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తుకోసం ఈ ప్రత్యేక హోదా కోసం బంద్కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

  • స్వచ్ఛందంగా సహకరించిన వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, పార్టీ కార్యకర్తలు అందరికీ, ముఖ్యంగా వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసేసినందుకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

  • అసలు ప్రత్యేక హోదా అన్నది ఎందుకింత చర్చనీయాంశమైందో, దానివల్ల వచ్చే లాభాలేంటో ప్రతి సందర్భంలోనూ చెబుతూ వచ్చాం.

  • అది వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రత్యేక హోదా వస్తే ప్రధానంగా రెండు మంచిపనులు జరుగుతాయి.

  • ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి గ్రాంటులు 90 శాతం, రుణాలు 10 శాతం అవుతాయి.

  • లేకపోతే గ్రాంటులు 30 శాతం కాగా, 70 శాతం రుణం అవుతుంది. అంటే.. కేంద్రం మనకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాల్సి వస్తుంది.

  • మరో మేలు ఏంటంటే.. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవాళ్లకు ఎక్సైజ్, సేల్స్, ఇన్ కం ట్యాక్స్ మినహాయింపులు వస్తాయి.

  • అవి వస్తేనే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు. పరిశ్రమలు పెట్టే ప్రయత్నం చేస్తారు.

  • అవి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే.

  • ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది.

  • 972 కిలోమీటర్ల తీరప్రాంతం మనకుంది. ఎన్నెన్ని పరిశ్రమలు వస్తాయి, ఎన్నెన్ని ఉద్యోగాలు వస్తాయి..

  • ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు మాత్రం ఆశ్చర్యంగా దీనిగురించి పోరాటం చేయడంలో వెనకడుగు వేశారు. దీనికి కారణమేంటి?

  • ఒకసారి కేంద్రం ప్రత్యేక హోదా తీసేసిందంటారు, మరోసారి 14వ ఆర్థికసంఘం వద్దని చెప్పిందంటారు. ఎందుకిన్ని అబద్ధాలు?

  • మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా  గురించి ప్రశ్న అడిగారు.

  • దానికి లిఖితపూర్వంగా వాళ్లు సమాధానం ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతోందని చెప్పారు. అంటే, కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వచ్చని అర్థం.

  • ఒకసారి మహారాష్ట్ర, ఒకసారి ఒడిషా, ఒకసారి తమిళనాడు వద్దంటున్నాయని చెబుతారు. కానీ ఈ రాష్ట్రాలన్నీ ఎన్నికలకు ముందు లేవా? అప్పుడు వాళ్లు వద్దంటున్న సంగతి తెలియదా?

  • అప్పుడు ఐదు కాదు, పదేళ్లు ఇస్తామని చెప్పారు. అది మోసం అని ఇప్పుడు అనిపించడం లేదా?

  • అసలు 14వ ఆర్థిక సంఘం ఏం చెబుతోంది, ఏం చెప్పదో మీకు తెలియదా? అయినా ఎందుకు మభ్య పెడుతున్నారు?

  • అసలు ప్రత్యేక హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘానికి సంబంధం లేదు. ఏ ఆర్థిక సంఘమైనా నాన్ ప్లాన్ గ్రాంటులు, కేంద్ర పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచడం.. ఈ రెండు అంశాలనే పట్టించుకుంటుంది. ప్లాన్ గ్రాంటు, ప్లాన్ లోటు గురించి పట్టించుకోదు.

  • ప్రధాని చైర్మన్గా ఉన్న నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మాత్రమే ప్రత్యేక హోదాను నిర్ణయిస్తుంది.

  • ప్రత్యేక హోదా ఇవ్వాలని గత కేబినెట్లోనే తీర్మానం చేశారు. నిర్ణయం జరిగిపోయినప్పుడు దాన్ని ఆపడం ఎంతవరకు సమంజసమని అడిగితే సమాధానం చెప్పరు.

  • ఇప్పుడు కొత్తగా ప్రత్యేక హోదా కన్నా స్పెషల్ ప్యాకేజి ముద్దు అని చెబుతున్నారు.

  • రాష్ట్రాన్ని విభజించేటప్పుడు పోలవరం ప్రాజెక్టు, ఇతర పనులు చేస్తామని హామీలు ఇచ్చారు. చట్టంలో కూడా పెట్టారు.

  • వాటికి ఎంత డబ్బు ఖర్చవుతుందో అందరికీ తెలుసు. ఆ డబ్బే ఇస్తామని చెబుతుంటే, దాన్ని ఏదో కొత్తగా ఇస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఆ ప్యాకేజి డబ్బు మా హక్కు.

  • ప్రధాని పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు టీడీపీ, బీజేపీ అన్నీ పార్లమెంటులో ఉన్నాయి.

  • అలాంటి హామీనే తుంగలో తొక్కేశారు. పార్లమెంటుకు, పార్లమెంటులో ఇచ్చిన హామీకే క్రెడిబులిటీ లేకపోతే ఇక ఎవరివైపు చూడాలి? నిజంగా ఇది అన్యాయం కాదా?

  • ఈ ప్రశ్నలు వేస్తూ చంద్రబాబు తన కేంద్రమంత్రులను ఎందుకు ఉపసంహరించుకోలేదు?

  • చంద్రబాబు ప్రధానితోను, అరుణ్ జైట్లీతోను గంటన్నర సమావేశం అయ్యారు, కానీ అంత సేపట్లో ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు.

  • చంద్రబాబును గట్టిగా మరోసారి డిమాండ్ చేస్తున్నాం.

  • ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వాళ్ల ఆకాంక్షలు ఏంటో చూశారు.

  • ఎంత తొక్కిపెట్టినా మీవల్ల కాదని చెప్పారు.

  • చరిత్ర హీనుడిగా మిగిలిపోవద్దు, జ్ఞానోదయం చేసుకోండి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మీ మంత్రులను ఉపసంహరించుకోండి.

  • ఈ పోరాటాన్ని ఇంతటితో ముగించేది లేదు. అసెంబ్లీలో కూడా దీనిపై చంద్రబాబును గట్టిగా నిలదీసేందుకు ప్రయత్నిస్తాం.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top