'అగ్రిగోల్డ్‌' అంశాన్ని అటకెక్కించేందుకే: వైఎస్‌ జగన్‌

'అగ్రిగోల్డ్‌' అంశాన్ని అటకెక్కించేందుకే: వైఎస్‌ జగన్‌ - Sakshi

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ అంశంపై చర్చను పక్కదోవ పట్టించేందుకే స్పీకర్‌ వ్యాఖ్యల అంశాన్ని తెరపైకి తెచ్చారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 20 లక్షల కుటుంబాలను రోడ్డున పడేసిన అగ్రిగోల్డ్‌ అంశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి పేరు ప్రస్తావనకు రావడంతోనే ఉద్దేశపూరితంగా అసెంబ్లీలో చర్చను అటకెక్కించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు నెల రోజుల కిందట జరిగిన మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా ప్రెస్‌మీట్‌లో స్పీకర్‌ చేసిన వ్యాఖ్యల అంశాన్ని కావాలనే తెరపైకి తెచ్చారని విమర్శించారు.



మహిళల అత్యాచారాలపై స్పందిస్తూ స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలను ఒక్క 'సాక్షి' మీడియానే కాకుండా రాష్ట్రంలోని అన్ని చానెళ్లు, జాతీయ మీడియా సైతం ప్రచురించాయని, అలాంటప్పుడు ఒక్క 'సాక్షి' మాత్రమే ఆయన వ్యాఖ్యలను ప్రచురించినట్టు ప్రభుత్వం హంగామా చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇంటియా టుడే, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, డెక్కన్‌ క్రానికల్‌ వంటి ఆంగ్ల మీడియాలో సైతం ఏపీ స్పీకర్‌ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి అంటూ కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌కు కాలువ శ్రీనివాసులు యాక్షన్‌, స్పీకర్‌ రియాక్షన్‌..ఇలా అన్ని కలిసొచ్చి అగ్రిగోల్డ్‌ అంశం అటకెక్కిందని తప్పుబట్టారు. ఇంకా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

 
  • స్పీకర్‌ వ్యాఖ్యల అంశం అసలు సభకు సంబంధించినది కాదు. ఈ అంశంపై వీడియోలు ప్రసారం చేయడం సభ సమయాన్ని వృథా చేయడమే.
  • ప్రజాస్వామ్యం నాలుగుకాళ్ల మీద నడువాలంటే అందరూ ఏకం కావాలి
  • నచ్చని టీవీ చానెళ్ల మీద ఇష్టమొచ్చినట్టుగా చర్య తీసుకుంటామంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది.
  • తెలంగాణలో ఎమ్మెల్సీ కొనుగోలు ప్రయత్నించి.. నోటుకు ఓటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. 
  • అప్పుడు చంద్రబాబు మాట్లాడిన ఆడియో, వీడియో క్లిప్పింగులు ఎందుకు అసెంబ్లీలో ప్రదర్శించడం లేదు
  • ఆ టేపులు శాసనసభలో ప్లే చేయాలని చంద్రబాబుకు, స్పీకర్‌కు అనిపించలేదా?
  • అగ్రిగోల్డ్‌కు రూ. 7వేల కోట్ల విలువచేసే భూములు ఉన్నాయి
  • అయినా, ఏడాదిన్నర కాలంలో కేవలం రూ.16 కోట్ల ఆస్తులు మాత్రమే అమ్మారు
  • అగ్రిగోల్డ్‌ ఆస్తుల నుంచి రూ. 1180 కోట్లు ఇస్తే 13 లక్షలమంది బాధితులకు న్యాయం జరుగుతుంది. ఇదే అగ్రిగోల్డ్‌ బాధితుల ప్రధాన డిమాండ్‌. కానీ ఆ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
  • అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో 105మంది చనిపోయారు. వారికి కేవలం రూ. 3 లక్షల పరిహారం ఇచ్చారు. చంద్రన్న పథకం కింద రూ. 5 లక్షల ఎక్స్‌గ్రెషియా ఇస్తూ.. అగ్రిగోల్డ్‌ బాధితులకు ముష్టి మూడు లక్షలా?
  • అగ్రిగోల్డ్‌ చైర్మన్‌, అతని ఒక తమ్ముడిని మాత్రమే అరెస్టు చేశారు. మిగతావారు బయట ఉండి ఆస్తులు అమ్ముతున్నారని బాధితులు చెప్పారు.
  • సీఐడీ విచారణ ప్రారంభించాక అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొంతమంది కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు
  • అందులో మంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి ఉన్నారు
  • అగ్రిగోల్డ్‌పై కేసులు నమోదయ్యాక తక్కువ ధరకు ఆ భూములు కొన్నట్టు మంత్రి పుల్లారావే స్వయంగా అంగీకరించారు
  • అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ సీతారాం తిరుపతిలోని హోటల్‌ను రూ. 14 కోట్లకు అమ్మారు
  • సీతారాం భార్య పుష్పలత 31 ఎకరాలు, కూతురు 8 ఎకరాలు విక్రయించారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు.
  • మంత్రి పుల్లారావు  దినకరన్‌ నుంచి భూములు కొనుగోలు చేశారు. ఆ దినకరన్‌ హాయ్‌లాండ్‌కు సీఈవో, డైరెక్టర్‌.
  • కానీ మంత్రేమో దినకరన్‌కు, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదంటున్నారు
  • హాయ్‌లాండ్‌ ఆస్తులు వేలం పరిధిలోకి రావా?
  • అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో హాయ్‌ల్యాండ్‌ ఆస్తులు, యరాడ వద్ద ఉన్న విలువైన ఆస్తులు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈ ఆస్తులను కూడా వేలం వేయాలి.
  • మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిబోయి.. స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని సభను తప్పుదోవ పట్టించారు.
  • పుల్లారావు భూముల కొనుగోలుపై హౌజ్‌ కమిటీ వేద్దామని ప్రభుత్వం అంటోంది
  • హౌస్‌ కమిటీ వేస్తే.. ప్రివిలేజ్‌ కమిటీలానే ఉంటుంది
  • ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే సిట్టింగ్‌ జడ్జితో జ్యుడీషియల్‌ విచారణ జరపాలి
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top