సీఎం యోగి మరో కీలక నిర్ణయం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మాయావతి సహా ములాయం కుటుంబ సభ్యులు డింపుల్ యాదవ్, శివపాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ తదితర ప్రతిపక్ష నేతల భద్రతను తగ్గిస్తూ యోగి నిర్ణయం తీసుకున్నారు. కాగా బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్తో పాటు కొందరికి భద్రత పెంచారు. వినయ్ కటియార్కు జెడ్ కేటగిరి భద్రత కల్పించారు. శనివారం రాత్రి హోం శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచే ఉత్తర్వులు అమలుకానున్నాయి.
యూపీలో మొత్తం 151 మంది వీఐపీలు భారీ భద్రత పొందుతున్నారు. వీరిలో 46 మంది వీఐపీలకు భద్రత తగ్గించగా, మిగిలిన 105 మందికి పూర్తిగా భద్రతను ఉపసంహరించారు. బీఎస్పీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా, యూపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్, ఎస్పీ ఎమ్మెల్సీలు అశు మాలిక్, అతుల్ ప్రధాన్ తదితరులకు పూర్తిగా భద్రతను తగ్గించారు. సెక్యురిటీ కలిగిఉండటం హోదాకు గుర్తుగా భావిస్తున్నారని, భద్రత సిబ్బందిని సామాన్యుల రక్షణ కోసం ఉపయోగించాలని ఇటీవల యోగి పేర్కొన్నారు.