యాకూబ్ కు ఉరిశిక్ష అమలు

యాకూబ్ కు ఉరిశిక్ష అమలు - Sakshi

ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ను నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో గురువారం ఉదయం 6:40 గంటలకు ఉరి తీశారు. చిట్టచివరి నిమిషంలో దాఖలైన పిటిషన్ ను దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా అర్ధరాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు విచారించిన సుప్రీంకోర్టు, ఆ పిటిషన్ ను కూడా కొట్టేయడంతో ఇక మెమన్ కు అన్ని దారులూ మూసుకుపోయాయి. ముందు నుంచి సిద్ధంగా ఉన్న నాగ్ పూర్ సెంట్రల్ జైలు అధికారులు.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉరిశిక్షను అమలు చేశారు. 

 

అంతకుముందు బుధవారం రాత్రి తన అన్న సులేమాన్ మెమన్, సమీప బంధువు ఉస్మాన్ లను యాకూబ్ మెమన్ కలుసుకున్నారు. గత వారం మెమన్ తన భార్య రహిన్, కూతురు జుబేదా తదితరులను కూడా కలుసుకున్నారు. పుణె ఎర్రవాడ జైలు నుంచి నాగ్ పూర్ కు మెమన్ ను 2007 ఆగస్టులో తరలించారు. ఆ తర్వాత సరిగ్గా 7 సంవత్సరాల 11 నెలల 17 రోజులకు అతడిని ఉరి తీశారు. 

 

మెమన్‌ను ఉరితీయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 30న ముంబైలోని టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని బుధవారం ఉదయం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ ఉత్తర్వులను తప్పుబట్టలేమంటూ మెమన్ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు, రాజ్యాంగ అధికరణ 161 కింద మెమన్  క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. ఉరిపై స్టే విధించాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసిన కాసేపటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆ నిర్ణయం తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా, క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మళ్లీ రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఈ రెండో పిటి షన్‌నూ రాష్ట్రపతి బుధవారం రాత్రి పొద్దుపోయాక తిరస్కరించారు.  మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఇప్పటికే ఒకసారి తిరస్కరించారు. 1993 మార్చి 12న, 13 వేర్వేరు చోట్ల జరిగిన వరుస పేలుళ్లతో ముంబై (నాటి బొంబాయి) వణికిపోయింది. ఆ భీకర పేలుళ్లలో 257 మంది చనిపోగా, సుమారు 700 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.


 


రాత్రి 10.45 ప్రాంతంలో రాష్ట్రపతి నిర్ణయం


మెమన్  క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్, సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌లతో బుధవారం రెండు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 10.45 గంటల సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఈ నిర్ణయం వెలువరించారు. రాష్ట్రపతితో భేటీకి ముందు, ప్రధాని నివాసంలో రాజ్‌నాథ్, గోయల్ ఇతర ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో సమావేశమై, మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున ఏ సూచన ఇవ్వాలనే విషయంపై చర్చించారు. సాధారణంగా ఈ విషయాల్లో కేంద్ర మంత్రిమండలి సలహా ప్రకారం రాష్ట్రపతి నడుచుకుంటారు. ఉరిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మెమన్ లాయర్లు బుధవారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాక అర్ధరాత్రి మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. క్షమాభిక్ష  పిటిషన్ నిరాకరణ తర్వాత ఉరి అమలుకు 14 రోజుల గడువు ఇవ్వాలని సుప్రీం మార్గదర్శకాలు సూచిస్తున్నాయని, అందువల్ల మెమన్‌కు 14 రోజుల సమయం ఇవ్వాలని కోరారు.


 


సుప్రీంలో.. ఏం జరిగింది


ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ దవేల ద్విసభ్య బెంచ్ మంగళవారం ఉరిని నిలిపేసే అంశంపై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఆ అంశపై తుది నిర్ణయం తీసుకునేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ రాయ్ సభ్యులుగా త్రిసభ్య బెంచ్‌ను చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు ఏర్పాటుచేయడం తెలిసిందే. విచారణ తర్వాత టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ సక్రమమేనని ఆ త్రిసభ్య బెంచ్ తేల్చింది. అలాగే, మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టేయడం సరైన చర్యేనంది. తన వాదనలు వినకుండానే ఉరిశిక్ష ఉత్తర్వులను టాడా కోర్టు జారీ చేసిందని, తన  క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత ఉరిశిక్ష అమలు తేదీని తనకు తెలియజేసే విషయంలో పాటించాల్సిన 14 రోజుల గడవు నిబంధనను ఆ కోర్టు పాటించలేదని మెమన్ చేసిన వాదనను ధర్మాసనం  తోసిపుచ్చింది. క్షమాభిక్ష పొందే విషయంలో తనకింకా న్యాయపరమైన అవకాశాలున్నాయన్న వాదననూ కొట్టేసింది. తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2015, జూలై 21న కొట్టేసిన తరువాతే.. క్షమాభిక్ష కోరుతూ మెమన్ మహారాష్ట్ర గవర్నర్‌ను ఆశ్రయించారని గుర్తు చేసింది. మెమన్ పిటిషన్‌ను ఏప్రిల్ 11, 2014న రాష్ట్రపతి తిరస్కరించారని, ఆ విషయాన్ని మే 26, 2014న మెమన్‌కు తెలియజేశారని పేర్కొంది. మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేసేందుకు మెమన్ ప్రయత్నించలేదని, అందువల్ల తాజాగా రాష్ట్రపతికి ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్.. ఉరిశిక్ష అమలులో అడ్డుకాబోదని స్పష్టం చేసింది. తనకు అనుకూలంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ (రా) మాజీ అధికారి రాసిన ఒక వ్యాసాన్ని, అలాగే స్కీజోఫ్రీనియాతో బాధపడుతున్నాననే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ మెమన్ రాష్ట్రపతికి పెట్టుకున్న రెండో క్షమాభిక్ష పిటిషన్ గురించి తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేసిన సమయంలో ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ జడ్జీలు ముగ్గురు( చీఫ్ జస్టిస్ సహా) నిబంధనల ప్రకారం నడుచుకోలేదన్న జస్టిస్ జోసెఫ్ కురియన్ అభిప్రాయంతో బెంచ్ ఏకీభవించలేదు. మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని జస్టిస్ కురియన్ మంగళవారం అభిప్రాయపడిన విషయం తెలిసిందే.


 


మెమన్ ద్రోహి.. ఏజీ


విచారణ ముగింపు దశలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వ్యాఖ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మెమన్‌ను ద్రోహి అని రోహత్గీ పేర్కొనడంపై సీనియర్ న్యాయవాది టీఆర్ అంధ్యార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదంటూ మెమన్‌కు మద్దతుగా వాదించబోతున్న అంధ్యార్జునను రోహత్గీ అడ్డుకున్నారు. ‘క్షమాభిక్ష పిటిషన్ అనేది గౌరవానికి సంబంధించిన అంశం కాదు. అది దోషుల రాజ్యాంగ హక్కు. న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తికాకుండా మెమన్‌ను ఉరితీయడం అన్యాయం’ అని అంధ్యార్జున అన్నారు. దానికి ‘పేలుళ్లలో చనిపోయిన 250 మంది హక్కుల మాటేమిటి? ద్రోహిని సర్థిస్తూ మీరు మాట్లాడుతున్నారు’ అని రోహత్గీ అన్నారు. ‘మరణం అంచున ఉండి, జీవితం కోసం పోరాడుతున్న వ్యక్తిని పరిహసించకూడద’ని అంధ్యార్జున పేర్కొనడంతో.. మెమన్‌ను ద్రోహి అని సుప్రీంకోర్టే పేర్కొందని రోహత్గీ గుర్తుచేశారు.


 


కలాంకు నివాళిగా.. ఉరిని నిలిపేయండి!


మాజీ రాష్ట్రపతి కలాం సిద్ధాంతాలను గౌరవిస్తూ.. మెమన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించాలని పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు  గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. మరణశిక్షను కలాం  వ్యతిరేకించేవారని, అందువల్ల మెమన్‌కు విధించిన ఉరిశిక్షను తగ్గించడం కలాంకు సరైన నివాళి ఇవ్వడం అవుతుందన్నారు. 


 


ఉరి తీయాల్సిందే


మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనని ముంబై పేలుళ్ల బాధితులు పలువురు స్పష్టం చేశారు. వారంతా కలసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు వినతి పత్రం సమర్పించారు. దానిపై 1,600 మంది సంతకాలు చేశారు. ‘ఆత్మీయులను కోల్పోయి మా కుటుంబాలు ఎంతో వేదనను అనుభవించాయి.  మెమన్‌కు ఉరిశిక్ష విధించాల్సిందే’ అని పేలుళ్లలో తన తల్లిని కోల్పోయిన తుషార్ దేశ్‌ముఖ్ డిమాండ్ చేశారు.


 


పార్టీల స్పందన


ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ముంబై పేలుళ్ల బాధితులకు న్యాయం జరిగింది. ఈ దేశ ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మరింత పెరిగింది’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ వ్యాఖ్యానించారు. ముంబై పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయమే అందింది. పేలుళ్ల కీలక సూత్రధారి టైగర్ మెమన్‌ను పాక్ నుంచి తీసుకువచ్చి శిక్ష విధించిననాడే వారికి పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా పేర్కొన్నారు. మెమన్‌కు క్షమాభిక్ష ప్రసాదించకూడదనేది దేశప్రజలందరి ఆకాంక్ష అని శివసేన పేర్కొంది. న్యాయవర్గాల్లో మాత్రం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


 


నిరుత్సాహపరచింది.. ఒవైసీ


కోర్టు తీర్పు నిరుత్సాహపరచిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయ మద్దతు లేకపోవడం వల్లనే మెమన్‌కు ఉరిశిక్ష విధించారన్నారు. పేలుళ్లలో మెమన్ పాత్ర ఉందని, అయితే, అందుకు ఉరిశిక్ష విధించడం మాత్రం సరికాదన్నారు. బాబ్రీమసీదు కూల్చివేతదారులకు కూడా ఉరిశిక్ష విధించాలని ఒవైసీ డిమాండ్ చేశారు.


పదేళ్లలో నాలుగోది

న్యూఢిల్లీ: యాకుబ్ మెమన్ ఉరితీతతో కలిపి భారత్‌లో గత పదేళ్లలో నాలుగు ఉరిశిక్షలు మాత్రమే అమలయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2004-2013 మధ్య దేశంలోని కోర్టులు ఏకంగా 1,303 మందికి మరణశిక్షలు విధించాయి. వీరిలో ముగ్గురే ఉరికంబమెక్కారు. ఓ టీనేజీ అమ్మాయిని రేప్ చేసి చంపిన వాచ్‌మన్ ధనంజయ్ ఛటర్జీని 2004 ఆగస్టు14న బెంగాల్‌లోని అలిపోర్ జైలులో ఉరితీశారు. 2008 ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ కసాయి కసబ్ ను 2012 నవంబరు 12న పుణే యెరవాడ జైల్లో ఉరితీశారు.  2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడింది)ను తీహార్ జైలులో ఉరి తీశారు. గత పదేళ్లలో ఉరికంబమెక్కిన వారిలో యాకుబ్ నాలుగోవాడు కానున్నాడు. ఈ పదేళ్ల కాలంలో 3,751 ఉరిశిక్షలను వివిధ కోర్టులు జీవితఖైదుగా మార్చాయి.



మరికొన్ని అంశాలు..



► స్టే పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

►క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్

►సుప్రీం తీర్పును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్..

►ముంబై, నాగపూర్‌లలో భద్రత కట్టుదిట్టం

► అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం

►1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top