మగబిడ్డ కోసం బలవంతం.. భర్త హత్య!

మగబిడ్డ కోసం బలవంతం.. భర్త హత్య! - Sakshi


న్యూఢిల్లీ: మగబిడ్డ కోసం దుర్మార్గంగా వ్యవహరించిన ఓ వ్యక్తిని అతని భార్య చంపేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. తన వారసత్వాన్ని, కుటుంబవ్యాపారాన్ని కొనసాగించేందుకు తనకు మగబిడ్డ కావాలని, ఇందుకోసం సోదరుడితో గడుపాల్సిందిగా ఆ వ్యక్తి భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు భార్య నిరాకరించడంతో ఆమెను చితకబాదాడు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిస్తానని, ఆమెను వేశ్యగృహాలకు అమ్మేస్తానని బెదిరించాడు. ఆ దంపతులకు ఒక కూతురు ఉంది. మగబిడ్డ కోసం పలుసార్లు బాధితురాలికి అబార్షన్‌ చేయించాడు. ఈ క్రమంలో ఏడాదిపాటు అతని వేధింపులు భరించిన ఆమె.. గత ఆదివారం సహనం కోల్పోయి భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. భర్త తాగిన పానీయంలో నిద్రమాత్రలు కలిపి.. అతడు నిద్రపోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపేసింది.



ఈ మరునాడు పోలీసులకు ఫోన్‌ చేసి తన భర్త హత్యకు గురయ్యాడని, ఇంటికి వచ్చిన అతిథులు అతన్ని చంపి ఉంటారని చెప్పింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె అల్లిన కథనాన్ని పోలీసులు చివరకు ఛేదించారు. హత్య జరిగిన రోజు రాత్రి మూడు గంటలసమయంలో ఆమె ఇంటికి ఆమె సోదరుడు వచ్చిన విషయాన్ని సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా ధ్రువీకరించిన పోలీసులు.. ఈ దృశ్యాల ఆధారంగా విచారించడంతో తామే పథకం ప్రకారం అతన్ని చంపామని ఆమె పోలీసులు ముందు అంగీకరించారు. ఆమెను, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.



ఈ సందర్భంగా తన 18 ఏళ్ల వైవాహిక జీవితంలో భర్త చేతిలో ఎలాంటి హింసను, క్షోభను అనుభవించిందో వివరించింది. మగబిడ్డ కోసం పెళ్లయిన కొన్నేళ్ల నుంచే వేధించడం మొదలుపెట్టాడని, తమ మొదటి బిడ్డ పుట్టిన నాలుగేళ్లకే పౌష్టికాహార లోపంతో మరణించిందని, ఆ తర్వాత పలుసార్లు గర్భం దాల్చినా.. మగబిడ్డ కాదని పరీక్షల్లో తేలడంతో అబార్షన్లు చేయించాడని ఆమె వివరించింది. చివరకు సోదరుడితోనే గడుపాల్సిందిగా తనపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడని, దీనితో సహనం కోల్పోయి హత్య చేసినట్టు ఆమె తెలిపిందనిపోలీసులు వెల్లడించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top