మెట్రో స్టేషన్లో ఉరేసుకున్న మహిళ!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సుమారు 30 ఏళ్లకుపైగా వయస్సున్న మహిళ కశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్లోని స్టోర్రూమ్లో ఓ పైపుకు ఉరేసుకుంది. ఫ్లాట్ఫాం 2లో ఉన్న గదిలో ఉరేసుకున్న ఆమెను గుర్తించిన స్వీపర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆమెను వెంటనే ఆస్పత్రికి పోలీసులు తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ఇంకా మృతురాలి వివరాలు తెలియరాలేదని, సూసైడ్ లేఖ లాంటివి కూడా ఘటనాస్థలంలో దొకరలేదని పోలీసులు తెలిపారు. ఫ్లాట్ఫామ్ మీద ఉన్న సీసీటీవీ కెమెరాలలోని దృశ్యాలను సేకరించిన పోలీసులు.. ఈ దృశ్యాల ఆధారంగా ఆ మహిళ స్టోర్రూమ్లోకి ఎలా వెళ్లింది? అనేది తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మామూలుగా నిర్మానుష్యంగా ఉండే స్టోర్రూమ్ (గోదాం గది)లోకి ఆమె వెళ్లి.. బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని, ఆమె ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.