అత్యాచారమంటూ.. అడ్డంగా దొరికిపోయింది

అత్యాచారమంటూ.. అడ్డంగా దొరికిపోయింది - Sakshi


కోయంబత్తూరు: 22 ఏళ్ల కుమార్తె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కుమార్తె ప్రేమ విషయం తెలిసిన  తల్లిదండ్రులు ఆమెకు తగిన వరుడు కోసం వేట మొదలు పెట్టారు. ఆ విషయం తెలిసిన యువతి... తన తల్లిదండ్రుల ప్రయత్నాన్ని ఎలా అయిన విరమింప చేయాలని నాటకానికి తెర తీసి... పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.


పోలీసుల కథనం ప్రకారం.... తమిళనాడు ఈరోడ్డులోని ఓ యువతి హాస్టల్ లో ఉంటూ ఏడాదిగా ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే జులై 28వ తేదీన హాస్టల్ రూమ్లో కాళ్లు చేతులు బంధించబడి ఉన్న యువతిని చూసిన  హాస్టల్ సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీయగా  తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని తెలిపింది. దాంతో వారు శరవణంపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దాంతో పోలీసులు హాస్టల్కు చేరుకున్నారు. సదరు యువతి.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు తమ కుమార్తెను అక్కడ నుంచి ఇంటికి తీసుకు వెళ్లిపోయారు.  పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా యువతిని ప్రశ్నంచగా... ఆమె పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు అనుమానించి గట్టిగా ప్రశ్నించారు.


దాంతో  ఆ యువతి నిజం ఒప్పుకుంది. తనపై అత్యాచారం జరిగిందంటే తనకు పెళ్లి సంబంధాలు రావని... అలా అయితే తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది. యువతి సమాధానం విన్న పోలీసులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇలాంటి పిచ్చి వేషాలు వేసి పోలీసులను తప్పు దోవ పట్టిస్తే కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామంటూ యువతితో ఆమె తల్లిదండ్రులను హెచ్చరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top