గర్భవతి కాకుండానే బిడ్డను ప్రసవించింది!

గర్భవతి కాకుండానే బిడ్డను ప్రసవించింది!

  • చెన్నైలో సినీ ఫక్కీలో భార్య మోసం



  • కేకేనగర్‌: చెన్నైలో ఓ యువతి గర్భవతి కాకుండానే.. శిశువుకు జన్మనిచ్చినట్లు నాటకమడింది. సినీఫక్కీలో భర్తను మోసం చేసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనిపై భర్త ఫిర్యాదు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.



    చెన్నై కీళ్పాక్కంలో పోలీసు సహాయ కమిషనర్‌గా పనిచేసి రిటైరైన సోమన్‌ కుమారుడు యోగేశ్వరన్‌.. ఇతనికి పద్మినితో 2016 ఫిబ్రవరి 14న పెద్దల అనుమతితో పెళ్లి జరిగింది. అయితే పద్మినిని యోగేశ్వరన్‌ ఇష్టపడకపోవడం.. తల్లిదండ్రులు తరచూ ఆమెను వరకట్నం కోసం  వేధించేశారని తెలుస్తోంది. బిడ్డ పుడితే సమస్యలు తీరుతాయని ఆమెకు బంధువులు చెప్పారు. దీంతో పద్మిని తాను గర్భవతినని భర్తను నమ్మించింది. ప్రతిసారి తల్లితోపాటు డాక్టర్‌ చెకప్‌కు వెళ్లేది. కానీ భర్తతో వెళ్లేది కాదు. ఆమెకు తొమ్మిదో నెలలో సీమంతం చేశారు. సీమంతానికి వచ్చిన పలువురు ఆమె గర్భవతిలాగే లేదని అనుమానం వ్యక్తం చేశారు. దానికి ఆమె తల్లి తమ వంశంలో అందరికీ ఇలాగే కడుపు లోపలగా ఉంటుందని నమ్మించింది. తర్వాత ఆమె ప్రసవం కోసం తల్లి ఇంటికి వెళ్లింది.



    ఈ నేపథ్యంలో బుధవారం తనకు ఆడ పిల్ల పుట్టిందని పద్మిని భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. బిడ్డను చూడడానికి వెళ్లిన యోగేశ్వరన్, అతని తల్లిదండ్రులకు శిశువు తీరును చూసి అనుమానం కలిగింది. శిశువుకు నాలుగు నెలలు వయస్సు ఉన్నట్టు అనుమానం రావడంతో భార్య ప్రవర్తనపై సందేహంతో యోగేశ్వరన్‌ పోలీసులకు, శిశు సంక్షేమ అధికారులకూ  ఫిర్యాదు చేశాడు. వారు పద్మిని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి విచారించారు. బిడ్డ ఏ ఆసుపత్రిలో పుట్టింది ఆధారాలు చూపించకపోవడంతో అధికారులు వారి వద్ద నుండి శిశువును తీసుకెళ్లారు. పద్మిని తన బంగారు తాళిబొట్టును అమ్మి బిడ్డను ఉత్తరాది దంపతుల వద్ద కొన్నట్లు చింతాద్రిపేట పోలీసుల విచారణలో తెలిసింది. పిల్లల కోసం భర్త, అత్త వేధింపులు, సాధింపులు తట్టుకోలేక తాను ఈ పని చేసినట్లు ఆమె అంగీకరించింది.

     

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top