ఎన్డీఏ ప్రభుత్వంపై దాడి కొనసాగుతుంది: మమత
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై పార్లమెంట్ లో దాడి కొనసాగిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పష్టం చేశారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణం అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తూనే ఉంటామని బుధవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో అన్నారు.
శారదా స్కామ్ లో తమ పార్టీని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఇతర చిట్ ఫండ్ కుంభకోణాల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. శారదా చిట్ ఫండ్ 2006లో ప్రారంభమైందని, తమ పార్టీ 2011లో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పరామర్శించేందుకు ఢిల్లీ వచ్చినట్టు మమతా తెలిపారు.