పార్టీ సారథిని ఎందుకు ప్రకటించలేదు?
పనాజీ: త్వరలో మహారాష్ట్రలో జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నా.. బీజేపీలో మాత్రం అనాసక్తత స్పష్టంగా కనబడుతోంది. ఇందుకు శివసేనతో పొత్తు విఫలమే ప్రధాన కారణం. ఇంతవరకూ అక్కడ సారథిని ప్రకటించకుండా బీజేపీ గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ బీజేపీ నుంచి కెప్టెన్ ఎవరూ లేకపోవడాన్నిఅవార్డు గ్రహీత, గోవా బీజేపీ నాయకుడు విష్ణు వాగ్ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లే ముందు నాయకుడ్ని ప్రకటిస్తేనే లాభం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అలా చేయకపోతే పార్టీ నష్టపోయే ఆస్కారం అధికంగానే ఉంటుందన్నారు.
ఇందుకు గోవాలో జరిగిన ఎన్నికలనే ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. గతంలో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బాధ్యతల్నిముందుగానే మనోహర్ పరికార్ కు అప్పగించడంతోనే పార్టీ విజయం సాధించిందన్నారు. ఇదే తరహాలో లోక్ సభ ఎన్నికల్లో కూడా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ముందు ఖరారు చేయడం కారణంగానే పార్టీకి లబ్ధి చేకూరిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.