విపక్షాలు అడ్డుకుంటే ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జల విధానాన్ని పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అసెంబ్లీలో వివరించాలన్న అంశంపై సీఎం కేసీఆర్ పునరాలోచనలో పడ్డారు. మండలి, అసెంబ్లీలను సంయుక్తంగా సమావేశపర్చి సాగునీటి ప్రాజెక్టులపై ఆయన ఆలోచనలు ఆవిష్కరించాలన్న యోచనపై తర్జనభర్జన పడుతున్నారు. పవర్పాయింట్ ప్రజంటేషన్పై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించడంతో ఆలోచనలో పడ్డా రు. ఇప్పటికే రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగి, స్పష్టమైన హామీలకు పట్టుపడుతున్నాయి. దీంతో ప్రజంటేషన్కు వారినుంచి ఏమైనా అడ్డంకులు ఎదురవుతా యా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు.
అయితే సాగునీటి ప్రాజెక్టులు, జల విధానం రైతుల కోసమేనని, సాగునీటిని అందించడమే రైతుల ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారమని, విపక్షాలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని సీఎం.. మంత్రులతో పేర్కొన్నట్లు సమాచా రం. అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పా టు చేసి జల విధానం ఆవశ్యకతను వివరించి, సభలో ప్రజంటేషన్ ఇచ్చేందుకు ప్రతిపక్షాలకు నచ్చజెప్పాలని చూస్తున్నారు. విపక్షాలు పంతానికి పోతే దీన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకున్న ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిం చారు. కాగా, సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల విషయంలో గతంలో జరిగిన అన్యాయంపై సభ్యులకు తెలియజేయాలని భావిస్తున్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రస్తావించాలన్నది కేసీఆర్ ఆలోచన. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సైతం వివరించాలని ఇప్పటికే భారీ కసరత్తు చేశారు. ప్రాజెక్టుల రీఇంజనీరింగ్, రీడిజైన్లు చేయాల్సిన అవసరాన్ని అన్ని పార్టీలు, ప్రజలకు తెలియజేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అదే సమయంలో అసెంబ్లీ వేదికగా ప్రజంటేషనిచ్చి తన దూరదృష్టి చాటుకోవాలనుకుంటున్నారు. అందుకే స్వయంగా గవర్నర్ నరసింహన్ను కలిసి తన ప్రజంటేషన్ చూపించి, ఉభయ సభల సం యుక్త సమావేశం ఏర్పాటుపై చర్చించారు.
సంబంధిత వార్తలు