రీకాల్ చేసే హక్కు ఉండాలి: విజయసాయి రెడ్డి
రాజకీయ నాయకుల విషయంలో రైట్ టు రీకాల్ విధానం (నాయకులను రీకాల్ చేసే హక్కు) అమలు కావాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఎన్నికల సంస్కరణలపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పార్టీ తరఫున పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచే అభ్యర్థులు రాజీనామా చేసే స్థానంలో మళ్లీ ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చును భరించాలని డిమాండ్ చేశారు. 2 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలను డీ రిజిస్టర్ చేయాలన్నారు.
పోటీ చేసే అభ్యర్థులకు వెయ్యి మంది ప్రపోజర్స్ ఉండాలని, పార్లమెంటుకు పోటీ చేసేవారికి రూ. 5 లక్షలు, రాజ్యసభకు రూ. 2 లక్షల డిపాజిట్ ఉండాలని అన్నారు. రాజకీయ పార్టీలు విడుదల చేసే ఎలక్టొరల్ బాండ్లకు ఐటీ మినహాయింపు ఉండాలన్నారు. రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు. నేరమయ, అవినీతి రాజకీయాలను ఎన్నికల వ్యవస్థ నుంచి తొలగించాలని.. ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా బాధ్యతగా మెలగాలని విజయసాయిరెడ్డి అన్నారు.