ఎంజీయార్‌కే పంగనామాలు

ఎంజీయార్‌కే పంగనామాలు


చెన్నై : ప్రజలకే కాదు...దివంగత నేత ఎంజీయార్‌కు సైతం అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత పంగనామాలు పెట్టారంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోపించారు. ఇందుకు తగ్గ లేఖ ఆధారం తన వద్ద ఉందని వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో డీఎండీకే నేతృత్వంలో గురువారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో విజయకాంత్ ప్రసంగిస్తూ, తీవ్రంగా స్పందించారు.

 

రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అంటూ సీఎం జయలలిత వ్యాఖ్యానిస్తుంటే, పోలీసు భద్రత మీద తమకు నమ్మకం లేదంటూ ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర పోలీసుల మీద తమకు నమ్మకం లేదని, కేంద్ర భద్రత అవసరం అని కోర్టు వ్యాఖ్యాలు చే స్తుండడం బట్టి చూస్తే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ మేరకు క్షీణించాయో స్పష్టం అవుతోందన్నారు.

 

ప్రజలకు భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జయలలిత, ఇప్పుడు ఆ కేంద్రంలో ఉత్పత్తి ఆగిందంటూ, అనుమతులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడం బట్టిచూస్తే, ఏ మేరకు అక్కడి ప్రజల్ని ఆమె మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తారు. 


అరాచకాలు పెరిగాయని, అవినీతి తాండవం చేస్తున్నదని పేర్కొంటూ, ఎలాగైనా సరే, కుట్రలు, కుతంత్రాలు, వ్యూ హాలతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జయలలిత ప్రయత్నాల్లో ఉ న్నారని, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలు పు నిచ్చారు.

 

ఓటుకు రూ. మూడు నుంచి రూ. ఐదు వేల వరకు ఇస్తారని, అది ప్రజల సొమ్ము కాబట్టి, వాటిని అందరూ తీసుకోవాలని, ఓటు మాత్రం మంచి వాళ్లకు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకే కాదు...ఎంజీయార్‌కే పంగనామాలు పెట్టిన ఘనత జయలలితకు దక్కుతుందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని తరిమికొడుదామని పిలుపు నిచ్చారు. ఇక, చెన్నైలో విలేకరులతో మాట్లాడిన, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడ్డారు.

 

రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. అలాగే, తిరుచ్చిలో జరిగిన బీజేపీ ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీ ధర్‌రావు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకేకు గుణపాఠం త థ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జయలలితకు రాజకీయ సంబంధిత సంబంధాలు లేవు అని, కేవలం పరిపాలనా పర వ్యవహారాల మధ్య సంబంధాలు మాత్రమే ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top