ఈ తీర్పు అంతిమం కాదు!
చెన్నై:ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడ్డ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితంపై ఇప్పటికే నీలినీడలు అలుముకున్నా.. ఇదే చివరి తీర్పు కాదంటున్నాయి అన్నా డీఎంకే మిత్రపక్షాలు. ఈ తీర్పును సవాల్ చేసి విజయం సాధిస్తామని ఏఐఎస్ఎంకే, తమిళగా వజ్హారిమై కచ్చిల అధినేతలు ఆర్ శరత్ కుమార్, టి.వేల్ మురుగన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం జయలలిత ముఖ్యమంత్రి పదవితోపాటు, ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోవల్సి వచ్చింది. అయితే తాజాగా ఏర్పడే ప్రభుత్వం మాత్రం జయ కనుసన్నల్లోనే కొనసాగే అవకాశమే మెండుగా కనిపిస్తోంది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతోపాటు రాష్ట్రంలోని సంక్షేమ ప్రభుత్వం కూడా జయలలిత మార్గదర్శకాలతోనే ముందుకుసాగనుంది. ఈ విషయాన్ని మిత్రపక్షాలే స్పష్టం చేశాయి.