'బిస్కట్ కింగ్' కోడలిని చంపింది భర్తే!

పియూష్ దాసాని (ఇన్ సెట్ లో జ్యోతి దాసాని)


కట్టుకున్న భార్యను హత్య చేయించి కట్టుకథ అల్లిన ఖతర్నాక్ భర్త భండారం బట్టబయలు చేశారు కాన్పూర్ పోలీసులు. ప్రియురాలి మోజులో పడి ఆలిని అంతమొందించిన అతడి ఆట కట్టించారు. ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన 'బిస్కట్ కింగ్' ఓంప్రకాశ్ దాసాని కోడలు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కోట్లకు పడగెత్తిన కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టిన జ్యోతి దాసాని(27) చివరకు భర్త పన్నిన కుట్రలో బలైంది.



భర్త పియూష్ దాసాని(30)తో కలిసి ఆదివారం రాత్రి బయటకు వెళ్లిన జ్యోతిని బైక్ వచ్చిన ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. తర్వాత ఆమెను పియూష్ కారులోనే హత్య చేశారు. దీనిపై పోలీసులకు పియూష్ సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. మార్గమధ్యలో ఇద్దరు దుండగులు తమను అడ్డగించారని, తనను కారులోంచి బయటకు తోసేసి జ్యోతిని ఎత్తుకెళ్లారని ఏడుస్తూ పోలీసులతో చెప్పాడు.



అయితే ఇదంతా కట్టుకథని, హత్యకు సూత్రధానరి పియూషేనని పోలీసులు తర్వాత తేల్చారు. ఆమెను అడ్డుతొలగించుకోవాలని అతడు పథకం వేశాడు. తన ప్రియురాలు డ్రైవర్ అవదేష్, అతడి అనుచరుడు రేణు కానౌజియా సాయంతో పథకాన్ని అమలు చేశాడు. పియూష్ అనుమానాస్పద వైఖరి, సెల్ఫోన్ లోని కాల్డేటా, ఎస్ఎంసెస్లు, అతడు తిరిగిన ప్రదేశాల్లోని సీసీటీవీ ఫుటేజ్ గా ఆధారంగా అసలు సూత్రధారి అతడేనని పోలీసులు నిర్ధారించారు. పియూష్ కూడా పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు.



పియూష్ ప్రతిరోజు అర్థరాత్రి ఒంటిగంట నుంచి 4 గంటలకు వరకు కనిపించకుండా పోయేవాడు. దీనిపై జ్యోతి పెద్దవాళ్లకు కూడా ఫిర్యాదు చేసింది. అసలు విషయం ఏమిటంటే పొరుగింట్లో ఉండే మనీషా మఖీజాతో పియూష్ ఎఫైర్ పెట్టుకున్నాడు. మనీషా గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని పియూష్ను ఆమె ఒత్తిడి చేసిందని, దీంతో జ్యోతి అడ్డు తొలగించుకునేందుకు ఇదంతా చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తాను పెడదారి పట్టడమే కాకుండా కట్టుకున్న భార్య చావుకు కారణమయ్యాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top