పార్టీ మారిన మంత్రి.. వేటువేసిన సీఎం
లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎస్పీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ గూటికి చేరిన ఉత్తరప్రదేశ్ మంత్రి విజయ్ మిశ్రా ఉద్వాసనకు గురయ్యారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సిఫారసు మేరకు గవర్నర్ రామ్ నాయక్.. విజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించారు. యూపీ రాజ్భవన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
గత యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన విజయ్ మిశ్రాకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అఖిలేష్ టికెట్ నిరాకరించారు. మిశ్రా సొంత నియోజకవర్గమైన ఘాజీపూర్ నుంచి ఈసారి ఎస్పీ తరఫున రాజేష్ కుష్వాహాను బరిలో నిలిపారు. దీంతో మిశ్రా.. అఖిలేష్పై విమర్శలు గుప్పించి బీఎస్పీలో చేరారు. అఖిలేష్ కొందరి చేతుల్లో బందీగా మారారని, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మిశ్రా బీఎస్పీలో చేరడంతో తర్వాత ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందిగా అఖిలేష్ గవర్నర్కు సిఫారసు చేశారు.