అంతర్జాతీయ విద్యార్థి దినంగా కలాం జయంతి: ఐరాస
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం లభించింది. ఆయన జయంతి అయిన అక్టోబర్ 15వ తేదీని అంతర్జాతీయ విద్యార్థి దినంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఇక కలాం అంత్యక్రియలు గురువారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రామేశ్వరం కలెక్టర్ నందకుమార్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రామేశ్వరానికి భౌతిక కాయాన్ని తరలిస్తారు. అక్కడకు చేరుకోగానే కలాం పూర్వీకుల ఇంటికి తీసుకెళ్తారు. ఆ తర్వాత రామేశ్వరం బస్టాండు ఎదురుగా ఖాళీ స్థలంలో ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచుతారు. అంత్యక్రియల కోసం మూడు స్థలాలను జిల్లా యంత్రాంగం పరిశీలించింది.
మేయంపులి వద్ద గల ప్రభుత్వ స్థలం, ధనుష్కోటి సమీపంలోని నటరాజపురం అటవీభూమి, అబిల్ కబిల్ దర్గా వద్ద గల ప్రైవేటు భూమి.. ఈ మూడింటినీ జిల్లా యంత్రాంగం పరిశీలించింది. కలాం సోదరుడు ఏపీజేఎం మరైకయార్, కుటుంబ సభ్యులను సంప్రదించి అంత్యక్రియల స్థలాన్ని ఖరారు చేస్తారు.