నవాజ్ షరీఫ్ కు తప్పిన ప్రమాదం!
ఇస్లామాబాద్:పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం నవాజ్ కుటుంబంతో కలిసి కారులో ఇస్లామాబాద్ కు వెళుతున్న సమయంలో ఆయన కాన్వాయ్ పైకి ఓ అనుమానాస్పద వాహనం ఆకస్మాత్తుగా దూసుకొచ్చింది. ఆ ఘటనకు సంబంధించి పూర్తి కారణాలు తెలియకపోయినా.. నవాజ్ షరీఫ్ ను లక్ష్యంగా చేసుకుని ఆ వ్యక్తి దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆకస్మాత్తుగా దూసుకొచ్చిన ఓ కారు నవాజ్ కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేసిన అనంతరం.. ఆయన కారును గట్టిగా ఢీకొట్టినట్లు పాక్ ప్రధాని కార్యాలయం ఈ మేరకు స్పష్టం చేసింది. ఈ ఘటన నుంచి ప్రధాని సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది. ఆ కారుకు ఉపయోగించిన నంబర్ ప్లేట్ నకిలీదిగా గుర్తించినట్లు పీఎంవో తెలిపింది.