బస్సుతో ఉడాయించారు
జమ్మూ: గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ పాఠశాల బస్సుతో ఉడాయించారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్దగల పురా ప్రాంతంలో గల సన్ షైన్ పాఠశాలలోకి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం అక్కడ ఉన్న పాఠశాల బస్సును తీసుకొని పారిపోయారు.
అంతకుముందు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్న స్కూల్ గార్డును చితకకొట్టి ఓ తాళ్లతో కట్టిపడేసి మరీ ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే, ఇప్పటికే ఆ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అది కొంత దెబ్బతిన్నది. ఎవరో స్థానికంగా కక్ష ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడ్డారని, ఉగ్రవాద కోణం లేదని తేల్చి చెప్పిన పోలీసులు ఆ ముగ్గురికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.