వివాహిత చీరలాగిన ఇద్దరి అరెస్టు
మహారాష్ట్రలోని భివాండిలో ఓ వివాహిత దుస్తులు విప్పేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి ఆ ఇద్దరిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నర్పోలి స్టేషన్ ఎస్ఐ యోగితా కోకటే తెలిపారు. నగరంలోని ఆంజనేయస్వామి గుడి ఎదురుగా గల శివాజీనగర్ ప్రాంతంలో ఉండే గణ్పత్ రాథోడ్, శంకర్ జాదవ్ అనే ఇద్దరు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతం నుంచి మహారాష్ట్రకు కూలి పనుల కోసం వచ్చిన పాతికేళ్ల నిర్మాణ కూలీని వారిద్దరూ అంబేద్కర్ విగ్రహం సమీపంలో అటకాయించారు. ఆమె చీర లాగేందుకు ప్రయత్నించారు. తమతో వస్తే 2వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు. ఆమె నిరాకరించడంతో అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించారు. ఆమెను కాపాడేందుకు వచ్చిన ఆమె వదినపై కూడా దాడి చేశారు. దీంతో వారిపై ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఎ), 354 (బి) కింద కేసులు నమోదు చేశారు.