ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నాకు ఏపీ నుంచి 2 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న ధర్నాకు రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... ఈ రెండు రైళ్లు అనకాపల్లి, తిరుపతి నుంచి బయలుదేర నున్నాయని తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే వైఎస్ జగన్ ధర్నా ముఖ్య ఉద్దేశం అని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. నష్టపోతున్న ఏపీ ప్రజల తరఫున వైఎస్ఆర్ సీపీ పోరాటం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునే వారు ఈ ధర్నాలో పాల్గొన్నాలని ధర్మాన ప్రసాదరావు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడాదిన్నర కావస్తుంది. అయినా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 10వ తేదీన న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.