ఉద్యానవన విశ్వవిద్యాలయానికి 4,922 హెక్టార్లు
గజ్వేల్లో రెండు ఎడ్యుకేషన్ హబ్లు
సొంత నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం సమీక్ష
హైదరాబాద్: మెదక్ జిల్లా ములుగులో ఉద్యానవన విశ్వవిద్యాలయానికి 4.922 హెక్టార్ల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో నెలకొల్పే ఈ యూనివర్సిటీ పనులు త్వరగా ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. దీనితో పాటు తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, గజ్వేల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పట్టణంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు బాలుర కోసం ఒక ఎడ్యుకేషన్ హబ్, 20 ఎకరాల విస్తీర్ణంలో ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు మరో ఎడ్యుకేషన్ హబ్ నిర్మించనున్నారు. పట్టణంలోని దాదాపు రెండు వేల కుటుంబాలకు గృహ సముదాయాలు నిర్మించనున్నారు.
1,200 మంది, 500 మంది పట్టే రెండు ఆడిటోరియాలతో కూడిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తారు. ఎడ్యుకేషన్ హబ్ల డిజైన్లను, ఆడిటోరియం, హౌజింగ్ కాలనీ లే అవుట్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించి ఆమోదించారు. వెంటనే అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని, పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, హైదరాబాద్లోని మారేడ్పల్లిలో నిర్మించ తలపెట్టిన క్రిస్టియన్ భవన్ నమూనాను, లే అవుట్ను సీఎం ఆమోదించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవన్లో ఆడిటోరియం, డైనింగ్ హాల్స్, పార్కు, లాన్స్ ఉండే విధంగా డిజైన్ చేశారు.