చంద్రబాబుపై నరసింహ ఆగ్రహం

చంద్రబాబుపై నరసింహ ఆగ్రహం - Sakshi


- సీఎం కాన్వాయ్‌కి అడ్డంగా కారు నిలిపిన తుడా చైర్మన్‌



తిరుపతి:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును నిరసిస్తూ టీడీపీకే చెందిన సీనియర్‌ నాయకుడు, తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(తుడా) చైర్మన్‌ నరసింహ యాదవ్‌ తీవ్ర చర్యకు దిగారు. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి అడ్డంగా కారును నిలపడంతో తిరుపతిలో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.



శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి తిరుపతి వచ్చిన చంద్రబాబు.. స్థానిక పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. శనివారం ఉదయానికే చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో గెస్ట్‌హౌస్‌ వద్దకు చేరుకున్నారు. అయితే మిగతావారిని లోనికి అనుమతించగా, తుడా చైర్మన్‌ నరసింహను మాత్రం సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించారు.



అందరినీ పంపించి, తనను మాత్రం బయటే నిలిపివేయడంతో నరసింహ ఆగ్రహానికి లోనయ్యారు. ‘మీతో కాదు.. చంద్రబాబుతోనే తేల్చుకుంటా..’అని సెక్యూరిటీ సిబ్బందిని హెచ్చరించారు. ఆ తర్వాత నర్సింహ యాదవ్‌ తన కారును తీసుకొచ్చి, ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి అడ్డంగా నిలిపారు. సీఎం తిరుపతి నుంచి నంద్యాలకు బయలుదేరాల్సిన సమయం ఆసన్నంకావడంతో అప్రమత్తమైన సిబ్బంది.. తుడా చైర్మన్‌ వాహనాన్ని పక్కకు తొలగించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top