ట్రంప్ ఎఫెక్ట్: ఐటీ, ఫార్మా ఢమాల్!
ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి సంతకంతోనే ఒబామా హెల్త్కేర్ పథకాన్ని రద్దు చేయడం దేశీయ ఫార్మా రంగాన్ని దెబ్బతీసింది. మరోవైపు ఉద్యోగ కల్పనలో అమెరికన్లకే ప్రాధాన్యమన్న వ్యాఖ్యలు దేశీయ ఐటీ రంగాన్ని ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు ఈ రంగాల షేర్లలో భారీ అమ్మకాలకు దిగారు. దీంతో ఎన్ఎస్ఈలో ఐటీ, ఫార్మా ఇండెక్సులు దాదాపు 1-2 శాతం క్షీణించాయి. ఐటీ స్టాక్స్లో మైండ్ట్రీ, టాటా ఎలక్సీ, టెక్ మహీంద్రా, కేపీఐటీ, ఒరాకిల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఐటీ దిగ్గజాలు మాత్రం ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రం స్వల్ప లాభాలతో ఉన్నాయి. ఇక ఫార్మా షేర్లలో పిరమల్, దివీస్, గ్లెన్మార్క్, డ్విట్స్ ల్యాబ్స్, అరబిందో, కేడిలా హెల్త్, సన్ ఫార్మా, లుపిన్, సిప్లా 2-0.5 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.
అటు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యొక్క రక్షణాత్మక ఆర్థిక విధానాలపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు నెగిటవ్ స్పందించాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో భారత ఈక్విటీ మార్కెట్లలో నష్టాలతో ప్రారంభమైనా..త్వరలోనే కోలుకుని సానుకూలంగా మారాయి. ఒక దశలో సెన్సెక్స్100 పాయింట్లకు పైగా లాభపడి 27,146 ను తాకింది. ముఖ్యంగా మార్కెట్ లో మెటల్ స్టాక్స్ భారీగా లాఢపడుతున్నాయి. ఎన్ఎస్ఇ మెటల్ ఉప ఇండెక్స్ 1.61శా\తం ఎగిసింది. వీటిలో హిందాల్కో, టాటా స్టీల్, జెఎస్డబ్ల్యు స్టీల్, ఒఎన్జిసి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలనార్జిస్తున్నాయి.