భారీ చోరీ.. దుండగుల కోసం గాలింపు
చెన్నై: రైల్లో కోట్ల రూపాయలు దొంగలించిన వారి ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. రూ. 5.78 కోట్ల చోరీ కేసు విచారణ నిమిత్తం సీబీసీఐడీ పోలీసులు బీహర్కు బయలుదేరారు. సేలం నుంచి చెన్నైకు వస్తున్న ఎగ్మూర్ ఎక్స్ప్రెస్ రైలులో గత ఏడాది ఆగస్టు ఎనిమిదో తేదీన గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన విషయం తెలిసిందే. రైలు బోగీపై కప్పును కత్తిరించి నగదు ఎత్తుకుపోయిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఘటన జరిగి 13 నెలలు కావస్తున్నా ఇంతవరకు దుండగుల ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు తంటాలు పడుతున్నారు. ఈ కేసు విచారణపై జరిపేందుకు సీబీసీఐడీ పోలీసులతో కూడిన నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో బృందంలో 20 మంది చొప్పున 80 మంది ఈ కేసు విచారణలో నిమగ్నమై ఉన్నారు.
ఈ బృందాలు రైలులో బాక్సు తీసుకువచ్చిన కేరళలోని కొచ్చి, ఈరోడ్, సేలం, చెన్నై రైల్వే స్టేషన్లలోను, నగదు ఎక్కించిన కాంట్రాక్టు సిబ్బంది, బ్యాంకు ఉద్యోగుల వద్ద విచారణ జరిపాయి. ఇందులో కొన్ని ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయి. దీంతో నిందితులను పట్టుకునేందుకు సీబీసీఐడీ పోలీసులు బీహర్ బయలుదేరారు. వారు కొన్ని రోజులు అక్కడ బసచేసి విచారణ జరుపనున్నారు.