123 కిలోల బంగారం దోచేశారు!
పెరూ దేశంలో కొంతమంది దుండగులు కలిసి.. విమానాశ్రయంలో మరికొద్ది సేపట్లో విమానంలోకి లోడ్ కాబోతున్న 123 కిలోల బంగారాన్ని దోచేశారు. దాంతోపాటు దాదాపు 13.3 కోట్ల రూపాయల నగదును కూడా వాళ్లు దోచుకెళ్లారు. సుమారు 12 మందికి పైగా ఉన్న సాయుధులు రన్వే మీదకు దూసుకొచ్చి, తుపాకులతో కాల్పులు జరిపి బష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఓ చిన్న విమానంలోకి ఎక్కించేందుకు కార్లలో సిద్ధంగా ఉన్న 123 కిలోల బంగారాన్ని, నగదును దోచుకున్నారు. అయితే, పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో వాళ్లలో ఆరుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తొలుత దొంగలు విమానాల మీదకు కూడా కాల్పులు జరపడంతో.. రెండు విమానాల్లోని ప్రయాణికులు పూర్తిగా కిందకు వంగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. దోచుకున్న తర్వాత అక్కడి నుంచి పొరుగునున్న బొలీవియాకు పారిపోవాలని భావించారు. పట్టుకున్న వాళ్లలో ఒకరు బొలీవియన్ దేశస్థుడు. పెరూలో ఇటీవలి కాలంలో నేరాలు బాగా ఎక్కువవవుతున్నాయి. తమ దేశంలో తాము సురక్షితంగా లేమని దాదాపు 76 శాతం మంది భావిస్తున్నట్లు పెరూలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కూడా తేలింది.